రంగారెడ్డి, మే 13 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఈనెల మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే మం చాల, యాచారం, ఫరూఖ్నగర్, ఆమనగల్లు మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభంకాగా, మరో వారం, పది రోజుల్లో మిగతా మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రానున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 47,231 ఎకరాల్లో వరి సాగు చేయ గా, 1.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లా అవసరాలు పోను 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని జిల్లా అధికారులు లక్ష్యం గా పెట్టుకున్నారు. మరోవైపు ధాన్యాన్ని విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు రోజుల్లోనే ప్రభుత్వం డబ్బులను జమ చేస్తున్నది. రూ.1960 మద్దతు ధరతో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నది.
సరిపడా గన్నీ బ్యాగులు..
జిల్లాకు సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటు లో ఉంచేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాకు 17 లక్షల గన్నీ బ్యాగులు అవసరంకాగా, ప్రస్తుతం జిల్లాలో 9 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 3.50 లక్షల గన్నీ బ్యాగులు రైస్ మిల్లర్ల నుంచి సేకరించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మిగతా గన్నీ బ్యాగులను కూడా వారం రోజుల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా గన్నీ బ్యాగులను తిరిగి ఇవ్వని రైస్ మిల్లర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, గన్నీ బ్యాగులను వెనక్కి ఇవ్వకుంటే ఒక్కో సంచికి రూ.5 చొప్పున వసూలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు.
చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు
జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తున్నది. ప్రస్తుతం 13 కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. మిగతా కొనుగో లు కేంద్రాలకు కూడా వారం, పది రోజుల్లో ధాన్యం వస్తుంది. అదేవిధంగా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు పూర్తి చేసేలా పౌరసరఫరాల అధికారులను ఆదేశించాం. ధాన్యాన్ని విక్రయించిన రైతుల కు రెండు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి
– తిరుపతిరావు, జిల్లా అదనపు కలెక్టర్
ఇప్పటివరకు 656 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ..
రంగారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటివరకు 656 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. జిల్లాలో 42 కొనుగోలు కేంద్రాలకుగానూ ఇప్పటివరకు 28 కేంద్రాలను ప్రారంభించారు. కాగా ఆయా కొనుగోలు కేంద్రాల్లో 13 కేంద్రాలకే రైతులు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. మంచాల మండలంలోని బోడకొండలో 79 మెట్రిక్ టన్నులు, అర్కపల్లిలో 13 మెట్రిక్ టన్నులు, నోములలో 59 మెట్రిక్ టన్నులు, ఆమనగల్లులో 209 మెట్రిక్ టన్నులు, యాచారంలో 18 మెట్రిక్ టన్నులు, వెల్జాల్లో 96 మెట్రిక్ టన్నులు, తలకొండపల్లిలో 16 మెట్రిక్ టన్నులు, ఆర్కే మైలారంలో 32 మెట్రిక్ టన్నులు, రాంపూర్లో 79 మెట్రిక్ టన్నులు, గట్టు ఇప్పలపల్లిలో 8 మెట్రిక్ టన్నులు, పడ్కల్లో 12 మెట్రిక్ టన్నులు, చుక్కాపూర్లో 14 మెట్రిక్ టన్నులు, కడ్తాల్లో 17 మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని ఇప్పటివరకు సేకరించారు.
అదేవిధంగా రైతులు ధాన్యాన్ని విక్రయించడంలో ఇబ్బందులకు గురికాకుండా గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం ఆదేశించడంతో అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఒకేసారి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకురాకుండా రైతులకు టోకెన్లను జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు 171 మంది రైతుల నుంచి రూ.12.87 లక్షల విలువైన ధాన్యాన్ని సేకరించారు.