షాబాద్, మే 12: అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం… రైతుల ప్రయోజనాల కోసం ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన రైతువేదికల ద్వారా వ్యవసాయశాఖ సాగుకు సన్నద్ధం చేస్తున్నది. వచ్చే వానకాలంలో ఎలాం టి పంటలు వేయాలి? ఏ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి? ప్రభుత్వ పథకాలను ఏ విధంగా అందుకోవాలి? వంటి అంశాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నది. అంతేకాకుండా నకిలీ విత్తనాలతో మో సపోకుండా అనుబంధ శాఖలు, పోలీస్ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. సాగు లో పాటించాల్సిన పద్ధతులు, నకిలీ విత్తన మోసాలపై వివరిస్తూ వారిని చైతన్యవంతులను చేస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో 83 రైతు వేదికలు..
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఆమనగల్లు(కల్వకుర్తి)నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లో ప్రభుత్వం మొత్తం 83 రైతువేదిక భవనాలను నిర్మించింది. ఒక్కో రైతువేదికను రూ.24 లక్షలతో 83 రైతు వేదికలను దాదాపుగా రూ. 20 కోట్లు ఖర్చు చేసి నిర్మించింది. ఈ భవనాల లోపల, బయట వ్యవసాయ పంటలకు సంబంధించిన బొమ్మలను వేయించడంతోపా టు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గోడలపై రాయించింది. కాగా వీటి నిర్వహణకు ప్రభుత్వం ప్రతినెలా రూ. 2వేల చొప్పున అందిస్తున్నది. అధికారులు క్లస్టర్ల వారీగా ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతున్నాయి. ఈ నిధులతో కరెంట్, తదితర సౌకర్యాలను కల్పిస్తున్నారు.
పంటల సాగుపై రైతులకు శిక్షణ..
రైతువేదిక క్లస్టర్ పరిధిలోని రైతులు ఎలాంటి పంటలు వేయాలి?, ఎలాంటి పంటలు వేస్తే లా భదాయకంగా ఉంటుంది..? ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ వివరాలు, రైతుబంధు, రైతుబీమా, ఇతర పథకాల పర్యవేక్షణ ఈవేదిక ద్వారానే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈ వేదిక ద్వారా వాతావరణ సమాచారం కూడా రైతులకు అనునిత్యం అందుబాటులోకి తీసుకొస్తోంది. వాతావరణంలో వచ్చే మార్పులను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నది. ఈ నేపథ్యంలో రైతులకు ప్రతి సమాచారాన్ని అందించేలా రైతువేదికలను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది.
ఈ వానకాలంలో ఎలాంటి పంటలను సాగుచేయాలనే విషయమై జిల్లాలోని అన్ని రైతు వేదికలో ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులకు శిక్షణా కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యవసాయ శాఖ అధికారులే కాకుండా పోలీసు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు కూడా పాల్గొంటున్నారు. విత్తనాల కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలు, ఎరువుల వాడకం, తదితర అంశాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. నకిలీ విత్తనాలను ఏ విధంగా అరికట్టా లో పోలీసులు రైతులకు వివరిస్తున్నారు. మొదటగా జిల్లా స్థాయిలో వ్యవసాయశాఖ సిబ్బందికి అధికారులు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులతో ఏవోలు, ఏఈవోలు సమావేశాలు నిర్వహించి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులకు రైతువేదికల్లో అధికారులు ఇచ్చే సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలను అందిస్తున్నారు.
–మధుసూదన్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, షాబాద్
జిల్లాలోని అన్ని వేదికల్లో శిక్షణ
జిల్లాలోని 83 క్లస్టర్లలోని రైతువేదికల్లో పంటల సాగుపై రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆయా మండలాల్లో క్లస్టర్ల వారీగా ఏవోలు, ఏఈవోలతోపాటు తాను కూడా స్వయంగా శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నా. వచ్చే వానకాలంలో ఏ పంటలు సాగు చేయాలి..? నకిలీ విత్తనాలు తదితర అంశాలపై రైతులకు క్షుణ్ణంగా వివరిస్తున్నాం. రైతులను చైతన్యం చేసేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
–గీతారెడ్డి, రంగారెడ్డిజిల్లా వ్యవసాయశాఖ అధికారి