రంగారెడ్డి, మే 5 (నమస్తే తెలంగాణ) : నేటి నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్, ఒకేషనల్ కలిపి 1,15,366 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 59,694 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 55,672 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లావ్యాప్తంగా 156 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్లయింగ్ స్కాడ్స్ బృందాలతోపాటు సిట్టింగ్ స్కాడ్స్ బృందాలను కూడా నియమించారు. తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్లతో కూడిన 28 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను జిల్లా ఉన్నతాధికారులు నియమించారు. అదేవిధంగా నలుగురు జూనియర్ లెక్చరర్లతో సిట్టింగ్ స్కాడ్ బృందాలను కూడా సంబంధిత అధికారులు నియమించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలుచేయనున్నారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు ఏఎన్ఎంలను అందుబాటులో ఉండనున్నారు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
విద్యార్థులు నిర్ణీత సమయంలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతివ్వరని ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను అమనుమతించనున్నారు. అయితే ఉదయం 9 గంటలలోపు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సంబంధిత అధికారులు సూచించారు.
వికారాబాద్ జిల్లాలో 17,565 మంది విద్యార్థులు
పరిగి, మే 5 : ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేపట్టారు. వికారాబాద్ జిల్లాలో 17,565 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవనుండగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 9,350 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 8,215 మంది విద్యార్థులు హాజరవుతారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులలో 8,000 మంది జనరల్, 1,350 మంది ఒకేషనల్, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 7,166 మంది జనరల్, 925 మంది ఒకేషనల్, 124 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఇంటర్ పరీక్షల కోసం జిల్లాలోని వికారాబాద్లో 9, తాండూరులో 9, పరిగిలో 5, కులకచర్లలో 2, కొడంగల్లో 2, దోమ, నవాబుపేట్, పెద్దేముల్, మోమిన్పేట్, మర్పల్లిలో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 32 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 32 మంది డిపార్ట్మెంట్ అధికారులు, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమించారు. మాస్ కాపీయింగ్ అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ఒక ఫ్లయింగ్ స్కాడ్, రెండు సిట్టింగ్ బృందాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏఎన్ఎంతోపాటు వైద్య సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేయడంతోపాటు వేసవికాలం దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నాపత్రాల బండిల్స్ తెరవడం, సమాధాన పత్రాల ప్యాకెట్లు సీల్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో నంబర్లు వేసే కార్యక్రమం చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 8.15 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు.