బొంరాస్పేట : కొడంగల్ నియోజకవర్గం పోలేపల్లి గ్రామంలో వెలిసిన ఆలయ ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రామ దేవతలకు నిర్వహించే జాతర లో ఇదే పెద్దది. కొలిచిన వారికి కొంగు బంగారంగా భాసిల్లు తూ, కోరిన కోరికలు తీర్చే దేవతగా ఎల్లమ్మ తల్లి ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. జాతరకు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రా ష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. జాతరలో ప్రధాన ఘట్టమైన సిడె కార్య క్రమం 25న జరుగునున్నది. ఈ సిడెను తిలకించ డానికి సుమారు లక్షన్నర మందికి పైగా భక్తులు హాజరవుతారు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాలయ కమిటీ చైర్మన్ ముచ్చటి వెంకటేశ్, మేనేజర్ రాజేందర్రెడ్డి తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ పరిగి, తాం డూరు, నారాయణ పేట డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనుంది.
జాతర ఉత్సవాలు గురువారం రాత్రి పల్లకీ సేవతో ప్రారంభమవు తాయి. పోలేపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం నుంచి అమ్మ వారి ఉత్సవాన్ని పల్లకీలో ఉంచి రాత్రి ఊరేగింపుగా జాతర ప్రాంగణంలోని ప్రధాన దేవాలయానికి తీసుకురావడంతో ఉత్స వాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఎల్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సిడె. ప్రత్యేకంగా తయారు చేయించిన రథం పొడవైన కట్టెకు చివరన ఉంచిన తొట్లెలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి దేవాలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణ చేయిస్తారు.
శనివారం సాయంత్రం అమ్మవారి రథోత్సవం నిర్వహిస్తారు. పూలతో అందంగా ముస్తాబు చేసిన రథంపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి జాతర మైదానంలో లాగుతారు. 27న ప్రత్యేక పూజ లు, 28న పూజల అనంతరం సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.