సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీ సరూర్నగర్ (రంగారెడ్డి జిల్లా), ప్రభుత్వ జూనియర్ కాలేజీ తాండూరు (వికారాబాద్ జిల్లా)లకు మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, ప్రహరీల నిర్మాణం కోసం రూ.4 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ నవీన్మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. రెండు జూనియర్ కాలేజీలకు రూ.2 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు చెప్పారు. కాలేజీల్లో మౌలిక వసతి సదుపాయాలకు కావాల్సిన నిధుల విడుదలకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిధులు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
ఈ కాలేజీల్లో నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీతో కలిసి పనులు చేయించుకోవాలన్నారు. ప్రతి పదిహేనురోజులకోసారి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఇంటర్ విద్యా కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు
– ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
తాండూరు : తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మహర్దశ వచ్చింది. నిజాం పాలనలో కట్టించిన తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉండడంతో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సహకారంతో ప్రభుత్వం నూతన భవనానికి రూ.2 కోట్లను కేటాయిస్తూ బుధవారం జీవోను జారీచేసింది. దీంతో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు, మంత్రి సబితారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఇంటర్ విద్యార్థులు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
సరైన సౌకర్యాలతో పాటు మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు స్థానిక నేతలు, అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో స్పందించిన ప్రభుత్వం సకల సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తెలిపారు. ఈ నిధులు సరిపోకుంటే మరిన్ని నిధులు తీసుకువచ్చి చక్కగా కళాశాలను నిర్మిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుండడంతో సామాన్యులకు కూడా కార్పొరేట్ విద్య, వైద్యం అందుతున్నదన్నారు. త్వరలో భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.