బొంరాస్పేట, డిసెంబర్ 19 : కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషితో దుద్యాల, బొంరాస్పేట మండలాల్లో 23 గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం బొంరాస్పేటలో పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మండలంలో వెనుకబడిన గిరిజన తండాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గ్రామ పంచాయతీలుగా చేసి వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, దుద్యాల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు చాంద్పాషా, పార్టీ తాలుకా అధికార ప్రతినిధి టీటీ రాములు నాయక్, నాయకులు దేశ్యానాయక్, సోంనాథ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు గిరిజనుల వినతి
బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో కొత్తగా ఏర్పాటైన గిరిజనతండా గ్రామ పంచాయతీలకు పంచాయతీ భవనాలను మంజూరు చేయాలని బీఆర్ఎస్ మండల నాయకుడు దేశ్యానాయక్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు నెహ్రూనాయక్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని కోరారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పంచాయతీ భవనాలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రాలేదని వారు సోమవారం ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అదేవిధంగా తండాలకు సీసీ రోడ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే స్పందించి రెండు మండలాల్లోని అన్ని గిరిజనతండా పంచాయతీలకు పంచాయతీ భవనాలు మంజూరు చేయిస్తానని, తండాలకు సీసీ రోడ్లు కూడా మంజూరు చేస్తానని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహానాయక్, రామకృష్ణ, నరేశ్ పాల్గొన్నారు.