ఆదిబట్ల, డిసెంబర్ 19: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర భుత్వం 108 అంబులెన్స్ వాహనాలను తీసుకొచ్చింది. రోగులు, క్షతగ్రాతులు, బాధితులకు మరింత వేగంగా మెరుగైన వైద్యం అందించేందుకు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నది. 108 అంబులెన్స్ వాహనాలకు సాంకేతికతతో కూడిన పరికరాలను అధికారులు అమర్చా రు. ప్రస్తుతం పదేండ్ల క్రితం ఉన్న వ్యవస్థనే కొనసాగుతుండటంతో బాధితులు, క్షతగ్రాతులకు వైద్యం అందడంలో జాప్యం జరుగుతుందన్న కారణంగా అంబులెన్స్ వాహనాలకు ప్రత్యేక జీపీఎస్ విధానాన్ని అమర్చా రు. దీని ద్వారా ఎక్కడైనా ప్రమాదం జరిగిందని బాధితుడు 108 అంబులెన్స్ డ్రైవర్కు ఫోన్ చేస్తే వెంటనే అతడి మొబైల్కు ట్రా కింగ్ లింక్ కూడా వెళ్తుంది. దాని ద్వారా అతడు క్షత్రగాతుల వద్దకు క్షణాల్లో వెళ్లి వారి ని రక్షించే వెసులుబాటు ఉంటుంది. గతం లో ప్రమాదాలు జరిగిన సమయంలో 108 కు ఫోన్ చేస్తే.. ఆ ఫోన్ కాల్ హైదరాబాద్లోని సెంట్రల్ ఆఫీసుకు చేరుకుని అక్కడి నుంచి ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గర్లో ఉన్న 108 వాహనానికి చేరేంది. దీంతో ఆ సిబ్బంది అప్రమత్తమై ఘటనాస్థలానికి వెళ్లేందుకు కొద్దిగా సమయం పట్టేంది.
ఆ జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీపీఎస్ విధానాన్ని అంబులెన్స్లకు అమర్చింది. ఈ కొత్త విధానం ద్వారా కాల్ చేసిన వ్యక్తికి 108 సెంట్రల్ ఆఫీస్ నుంచి ట్రాకింగ్ లింక్ వెళ్తుంది. ఈ లింక్ ద్వారా 108 వాహనం ఎక్కడుంది..ఎంతసేపట్లో ఘటనాస్థలికి చేరుతుందనే పూర్తి సమాచారం చేరుతుంది. తద్వారా బాధితులకు అంబులెన్స్ ఎప్పటి లోపు వస్తుందో స్పష్టం గా తెలుస్తుంది. కాగా రంగారెడ్డి జిల్లాలో 108 అంబులెన్స్లు 27 ఉండగా.. అమ్మఒడి 102 వాహనాలు 11 అందుబాటులో ఉన్నాయి.
నిరుపేదలకు వరం లాంటివి
రోగులు, ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం 108 అంబులెన్స్లను తీసుకొచ్చింది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో మారుమూల గ్రామా ల్లో సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో నిరుపేదలు వైద్య సేవలకు నోచుకోలేకపో యారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ వైద్య సదుపాయాలు అందుతున్నాయి.
-మంచిరెడ్డి కిషన్రెడ్డి ,ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం
క్షతగాత్రులను త్వరగా దవాఖానలకు తీసుకెళ్తున్నాం
గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనాస్థలికి చేరుకునేందుకు ఎంతో సమయం పట్టేది. జీపీఎస్ పరికరాల ఏర్పాటుతో బాధితుల వద్దకు త్వరగా వెళ్లి దవాఖానలకు తరలించి వైద్యసేవలు అందేలా చూ స్తున్నాం. జీపీఎస్ విధానంతో బాధితులకు తాము ఎక్కడున్నామో కూడా తెలిసిపోతుంది. ఈ విధానంతో క్షతగ్రాతులకు ఎంతో మేలు జరుగుతుంది.
-దశరథ,108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్
జీపీఎస్తో ఎంతో మేలు
108 అంబులెన్స్లకు జీపీఎస్ పరికరాలను ప్రభుత్వం అమర్చడంతో వీలైనంత త్వరగా బాధితుల దగ్గరకు వెళ్లొచ్చు. అలాగే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో అంబులెన్స్ వస్తుందన్న విషయం తెలుసుకుని ముందే ట్రాఫిక్ను క్లియర్ చేసే వీలుంటుంది. క్షతగ్రాతులను త్వరగా దవాఖానలకు తరలించి వైద్యం అందించి బతికించొచ్చు .
– రమేశ్, 108 జిల్లా కో-ఆర్డినేటర్