మొయినాబాద్, డిసెంబర్ 17 : జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని సాత్విక ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్లోని బాలాపూర్లో నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాల నుంచి పర్యావరణ శబ్ధ కాలుష్య రహిత రోడ్డు రవాణా, నిత్యజీవితంలో రేఖాగణిత ప్రాముఖ్యత, మాన్సూన్ హెల్మెట్ అనే నమూనాలను ప్రదర్శించారు. హెల్మెట్ అన్ని కాలాల్లో ధరించేలా సాత్విక రూపొందించింది. ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన మంత్రి సబితారెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్కు హెల్మెట్ ప్రయోజనాలను సమగ్రంగా వివరించింది. దీంతో వారు సాత్వికను, నమూనాను తయారుచేయడానికి సంపూర్ణ సహకారమందించిన ఫిజికల్ సైన్స్ టీచర్, మెంటర్ అనితను అభినందించారు. సాత్వికకు మంత్రి సబితారెడ్డి రూ.3000, ప్రశంసాపత్రం, షీల్డ్ను బహూకరించారు. హైదరాబాద్-రంగారెడ్డి పశ్చిమ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శారద స్వాతికతోపాటు విద్యార్థినిని ప్రోత్సహించిన పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, మెంటర్ అనితను అభినందించారు. పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.