రంగారెడ్డి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు సానబెడుతూ, వారు సరికొత్త ప్రయోగాలను ఆవిష్కరించేలా, సమాజంలో చోటు చేసుకున్న పలు సమస్యలకు పరిష్కారాలు సూచించేలా, చిన్నారుల చిట్టి బుర్రలు గట్టి ఆలోచనలు చేసేలా జిల్లా విద్యా, వైజ్ఞానిక శాఖ రెండు రోజుల పాటు విద్యార్థుల కోసం వైజ్ఞానిక ప్రదర్శనను అందుబాటులోకి తెచ్చింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇన్స్పైర్ మనాక్ 2021-22., జిల్లా స్థాయి వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శనకు ఇప్పటికే జిల్లా విద్యా, వైజ్ఞానిక శాఖలు ఏర్పాట్లను పూర్తి చేశాయి. బాలల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారిలో దాగి ఉన్న శక్తులను వెలికితీసేందుకు, అనేక కోణాల్లో జిజ్ఞాసను కలిగించేందుకు, సమాజంలోని వివిధ రంగాల సమస్యలకు తమ చిట్టి బుర్రల్లో తొలచిన పరిష్కారానికి తగు వేదికను విద్యా వైజ్ఞానిక శాఖ కల్పించింది. ఈ వేదికపై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వరకు గల అన్ని తరగతుల విద్యార్థులు పాల్గొనేందుకు ఇదొక ప్రత్యేక అవకాశం.
ప్రదర్శనకు ఏర్పాట్లు
నాదర్గుల్లోని శ్రీ వంశీధర్ హైస్కూల్లో ఈ నెల 14 నుంచి 15 వరకు విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా అధికార యంత్రాంగం తగు ఏర్పాట్లను చేసింది. విద్యార్థులు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివిధ కమిటీల కన్వీనర్లతో ఇప్పటికే జిల్లా విద్యాధికారి సుశీందర్రావు సమీక్షించారు. ప్రదర్శన గదులు, వసతి, భోజనాల ఏర్పాట్లు, ప్రదర్శనల నమోదు, జడ్జిమెంట్, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన అంశాల్లో చేపట్టాల్సిన విధి విధానాలను నిశితంగా ప్రస్తావించారు. వైద్య, పోలీసు, అగ్నిమాపక శాఖలకు సమాచారం అందించి ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లను చేపట్టారు. సమీక్షలో జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరావు, నాదర్గుల్ జీహెచ్ఎంసీ అధికారి రాజిరెడ్డి, డీసీ ఈబీ కార్యదర్శి రామచంద్రారెడ్డి, స్థానిక పాఠశాల డీన్ గోదాదేవి, అకాడమిక్ మేనేజర్ మధు, ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ, ఎంఈవో కృష్ణయ్య, వివిధ కమిటీల కన్వీనర్లు పాల్గొన్నారు.
300లకు పైగా ఎగ్జిబిట్లు
ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఇన్స్పైర్ మనాక్ విభాగంలో ఈ ప్రదర్శనకు పలు పాఠశాలల నుంచి 113 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఒక్కో అంశంలో భాగంగా ఒక విద్యార్థితో పాటు సబ్జెక్టు ఉపాధ్యాయుడు పాల్గొననున్నారు. మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 124 పాఠశాలల నుంచి పలువురు విద్యార్థులు నమోదయ్యారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా నమోదు ప్రక్రియ కొనసాగనుంది. జిల్లా సైన్స్ ఫెయిర్లో భాగంగా విద్యార్థులు అత్యధికంగా పాల్గొనే అవకాశాలున్నాయి. 300లకు పైగా ఎగ్జిబిట్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అందుకు తగినట్లే అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సందర్శకులతో కలిసి వెయ్యి నుంచి 1500 మంది దాకా ప్రదర్శనకు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
విద్యార్థులు 8 గంటలకే చేరుకోవాలి
– వై.శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి
ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి అన్ని యాజమాన్యాలు తమ విద్యార్థులతో బుధవారం ఉదయం 8 గంటల వరకు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ వంశీధర్ ఉన్నత పాఠశాల, నాదర్గుల్కు చేరుకోవాలి. విద్యార్థులు వారి పాఠశాల యాజమాన్యంతో తగు విధంగా ప్రదర్శనకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలి. ఎన్ని ఎగ్జిబిట్స్ను ప్రదర్శస్తున్నారో తెలియజేయాలి.
సృజనాత్మక శక్తిని వెలికితీయాలి
– సుశీందర్రావు, జిల్లా విద్యాధికారి
జిల్లాలోని బాలబాలికల్లో దాగిన సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ఉపాధ్యాయులకు ఇదో చక్కని అవకాశం. ఇలాంటి వేదికల్లో పిల్లలు పాల్గొనేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి. ప్రతి విద్యార్థి పాల్గొనేందుకు ఇదో అద్భుత వేదిక. ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు, భోజన, వసతికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశాం.