రంగారెడ్డి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తరహా పాలనను దేశం యావత్తు కోరుకుంటున్నదని.. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాంది పలకాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా పార్టీ నేతలు, అభిమానులు, మద్దతుదారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజల కోసం.. ప్రధానంగా రైతాంగం కోసం బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నదని.. ఇలాంటి పాలన బీఆర్ఎస్తో సాధ్యమని తెలిపారు. ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్’ నినాదంతో ముందుకు వెళ్తున్న కేసీఆర్కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నదని మంత్రి చెప్పారు. మంగళవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్లారు.