పెద్దఅంబర్పేట, డిసెంబర్ 10: ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) గ్రూప్ ఫౌండర్ హర్కార శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీటీజీ గ్రూప్ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని సద్దుపల్లి గ్రామం వద్ద ఆదర్శ రైతు గుడివాడ నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో శనివారం హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్లోని సెయింట్ మైఖేల్స్ స్కూల్కు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులకు ప్రకృతి సేద్యం, ఆర్గానిక్ వ్యవసాయం, మిద్దె పంటలపై అవగాహన కల్పించారు. సీటీజీ ప్రతినిధులు, విద్యార్థులకు ఉన్న పలు సందేహాలను నాగరత్నం నాయుడు నివృత్తి చేశారు. ప్రతి విద్యార్థి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని సీటీజీ పేర్కొన్నారు. అప్పుడే ఆహార పదార్థాల వృథాను సైతం అరికట్టగలమని చెప్పారు. అసలు వ్యవసాయం అంటే ఏమిటి ? దానికి ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులు ఏమిటి ? ఎంతమంది కష్టపడితే మన నోటి వరకు ఆహారం వస్తున్నది, టెర్రస్ గార్డెన్ అనేది ఎలా చేయాలి అంటూ పలు అంశాలను క్షుణ్ణంగా వివరించారు. మిద్దె పంటలతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించకుండానే మన ఇంటిపై మనమే పంటలు పండించుకోవచ్చని చెప్పారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని పేర్కొన్నారు.తక్కువ ఖర్చులో ఎక్కువ పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకొనే వెసులుబాటు మిద్దె పంటలతో సాధ్యమని వివరించారు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తే.. వారు తల్లిదండ్రులు, బంధువులకు వివరించే అవకాశం ఉంటుందని సీటీజీ ప్రతినిధులు తెలిపారు. ప్రతి విద్యార్థి తోటి విద్యార్థులతోపాటు తమకు కలిసినవారందరికీ ఈ మిద్దె తోటలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న పండ్లు, కూరగాయలను విద్యార్థులు ఉత్సాహంగా పరిశీలించారు. పొలంలో స్వయంగా నాట్లు వేశారు. మొక్కలు నాటే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీటీజీ ప్రతినిధులు వంకాయ, టమాట, క్యాబేజీ మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీటీజీ ప్రతినిధులు సంపత్, ఆర్పీ, వనజ, కుసుమ, సుధారాణి, అనురాధ, శివపూర్ణిమ, సురవర్జుల శైలజ, రాధిక, రాధా మాధవి, సుకేశిని, ప్రియంవద, రాణి, సీహెచ్ అనురాధ, శివపార్వతి, పావని, పరిణిత తదితరులు పాల్గొన్నారు.