ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 10 : నవీన్ అంటే నాకు ఇష్టం లేదు..అతడితో పెండ్లి జరిగిందని చెప్పడంలో వాస్తవం లేదని వైశాలి తెలిపారు. దంతవైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి పొంది శనివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలోని తనసొంత ఇంటికి చేరుకున్నది. విలేకరులతో ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో నవీన్ తనతో బ్యాడ్మింటన్ ఆడుతుండగా పరిచయం ఏర్పడిందని అతడితో స్నేహం మాత్రమే ఉండేదని చెప్పారు. దీనిని ఆసరాగా చేసుకుని తనను పెండ్లి చేసుకోవాలని కోరగా.. మా తల్లిదండ్రులు, నేను అంగీకరించలేదన్నారు. దీంతో తరుచుగా వేధించేవాడని, పెండ్లి చేసుకున్నానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, పెండ్లి చేసుకున్నామని చెప్పిన రోజు నేను ఆర్మీ డెంటల్ కళాశాలలో ట్రీట్మెంట్లో ఉన్నానని ఆమె వివరించారు. నీ ఇష్టంతో నాకు పనిలేదని నేనుమాత్రం నిన్నే పెండ్లి చేసుకుంటున్నానని, లేదంటే మీ నాన్నను చంపుతామని బెదిరించారని చెప్పింది.
ఈ విషయంపై తను పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు అతడిపై కఠినంగా చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్నారు. ఒక ఆడపిల్ల అని చూడకుండా పది మంది వచ్చి కిడ్నాప్ చేశారన్నారు. కిడ్నాప్ చేసిన సమయంలో తనపై అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టారని హెల్ప్.. హెల్ప్ అని అరుస్తుంటే గోళ్లతో గిల్లి.. నానా చిత్రహింసలకు గురిచేశారన్నారు. తనపై నవీన్తో పాటు మరో ఆరుగురు ఘోరంగా ట్రీట్ చేశారని చెప్పారు. నన్ను ఇప్పటి వరకు మా నాన్న కూడా కొట్టలేదని, నవీన్ నన్ను ఘోరంగా కొట్టాడని ఆమె చెప్పారు. నాకు నవీన్తో ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. నవీన్ అతడి అనుచరులు తమ ఇంటి వద్ద ఆటవికంగా ప్రవర్తించి మా తల్లిదండ్రులను, బంధువులను తీవ్రంగా కొట్టారని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను అభ్యర్థించారు. నన్ను కిడ్నాప్ చేసిన నవీన్, అతడి ముఠాను కఠినంగా శిక్షించాలని వైశాలి కోరారు.