ఇబ్రహీంపట్నం, నవంబర్ 30 : రంగాడ్డిజిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. బుధవారం రికార్డు స్థాయిలో ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలో రాష్ట్రంలోనే అతితక్కువగా 8.6 డిగ్రీలు నమోదైంది. ఒకపక్క దట్టమైన పొగమంచు, మరోపక్క చల్లటి గాలులతో జనం అల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటినా మంచు వీడకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణుకుతున్నారు. రాత్రివేళల్లో ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. చాలామంది చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఉదయం పూట మంచు కమ్మేస్తుండడంతో జనం, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్పల్లి గ్రామంలో రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ గ్రామంలో బుధవారం 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. గత వారం రోజుల కింద తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని తొర్రూరు గ్రామంలో కూడా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మంగల్పల్లి, తొర్రూరు తదితర గ్రామాల్లో చలి పులి పంజా విసురుతోంది.
పల్లెల్లో చలిమంటలు..
చలితీవ్రత పెరుగడంతో పల్లెల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం ఎక్కడ చూసినా మంటలకు చలి కాచుకుంటున్నారు. వ్యవసాయ పనులు, ఇతరత్రా పనులకు వెళ్లేవారు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
కమ్ముకుంటున్న పొగమంచు..
ఉదయం పూట పొగ మంచు కమ్మేస్తున్నది. రెండు, మూడు రోజులుగా తీవ్రస్థాయిలో పొగమంచు కురుస్తుండడంతో వాహనదారులు రోడ్ల వెంట లైట్లు వేసుకుని వెళ్లినా దారి కనిపించకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి..
అస్తమా, శ్వాసకోశ, ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నవారు చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులు, దగ్గు ఉన్నవారు చల్లటి వస్తువులను అసలు వాడకూడదు. ఇలాంటి వారు ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– అబ్బయ్య, ప్రముఖ వైద్యులు