వికారాబాద్, నవంబర్ 30 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను ఈ నెల 15నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మన ఊరు-మనబడి పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో మొదటి విడుతగా మంజూరైన 37 పాఠశాలల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన ప్రహరీలు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు ఇతర పనులన్నీ పూర్తి చేయాలన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఈఈలు, డీఈలు, కేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి అన్ని హంగులతో పాఠశాలలను సుందరీకరించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డీఆర్డీవో కృష్ణణ్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ ఇరిగేషన్, టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ శాఖల ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.