యాలాల, నవంబర్ 30 : ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం.. ప్రగతిలో పరవళ్లు తొక్కుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. స్వచ్ఛతకు పుట్టినిళ్లులా నిలుస్తున్న రాస్నం గ్రామం రూపురేఖలు మారి కొత్తందాలను సంతరించుకున్నది. మూడేండ్లలో ఊహించని అభివృద్ధి జరుగడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడంతో పాటు ప్రతి వీధిని శుభ్రం చేసి చెత్తనంతా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తరలించిన చెత్తను సేంద్రియ ఎరువుగా తయారుచేసి హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ రోడ్లను నిర్మించడంతో ఏ వీధి చూసినా పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించడంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటి సరఫరా అవుతుండడంతో నీటి కష్టాలు తప్పాయి. ప్రతి వీధిలో విద్యుత్ దీపాలను వేయడం వల్ల రాత్రి వేళల్లో జిగేల్మంటున్నాయి. పాడావు పడ్డ ఇండ్ల కూల్చివేతతోపాటు బావులను పూడ్చివేశారు. మురుగు కాల్వలను నిత్యం శుభ్రం చేయడంతో పాటు దోమల నివారణకు మందులను చల్లుతున్నారు. గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు పచ్చని తోరణాల్లా స్వాగతం పలుకుతున్నాయి.
ప్రగతి పనులు..
గ్రామంలో 2436 మంది జనాభా ఉన్నారు. రూ.22 లక్షలతో రైతువేదిక, రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.3 లక్షలతో కంపోస్టుయార్డు, రూ.2 లక్షలతో పల్లె ప్రకృతి వనం పనులు చేపట్టారు. నర్సరీలో వివిధ రకాల 15 వేల మొక్కలను పెంచుతున్నారు. 30 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో 10 రకాలకు చెందిన 2200 మొక్కలను పెంచుతున్నారు. గ్రామ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా 800 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాం..
ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాం. వైకుంఠధామం, డంపింగ్యార్డు నిర్మాణాలను పూర్తి చేసి వినియోగించుకుంటున్నాం. పల్లె ప్రకృతి వనం నిర్మాణంతో పల్లెకు కొత్తందం వచ్చింది. ఎమ్మెల్యే, పంచాయతీ పాలకులు, గ్రామస్తుల సహకారంతో మరింత గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.
– కావలి సురేఖ, రాస్నం సర్పంచ్
పారిశుధ్యంపై పక్కా చర్యలు..
నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. చెత్తనంతా సేంద్రియ ఎరువుగా తయారు చేసి హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నాం. వంద శాతం మరుగుదొడ్లను నిర్మించడంతో స్వచ్ఛ గ్రామంగా మారింది.
– తంగెళ్ల పిచ్చంరాజు, రాస్నం పంచాయతీ కార్యధర్శి