వికారాబాద్, నవంబర్ 30 : బ్యాంకర్లకు నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సెప్టెంబర్ నెలాఖరు లోపు వ్యవసాయ రుణాలు రూ.3440 కోట్ల అందించే లక్ష్యం కాగా రూ.1076 రుణాలు అందించి 31 శాతం రుణాలను ఇవ్వడం జరిగిందన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.1016 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యం కాగా రూ.245 కోట్ల రుణాలు ఇచ్చి 24 శాతం లక్ష్యానికి చేరుకున్నామన్నారు. ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.1237 కోట్ల రుణాలను అందించాల్సి ఉండగా రూ.65 కోట్లు అందించామన్నారు. మొత్తం ప్రాధాన్యతా రంగాలకు రూ.5692 కోట్ల రుణాల లక్ష్యం కాగా, రూ.1385 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రాధాన్యేతర రంగాలకు రూ.952 కోట్ల రుణాల లక్ష్యం కాగా, రూ.430 కోట్లు అందించి 43 శాతం లక్ష్యాన్ని సాధించిందన్నారు.
జిల్లా మొత్తం క్రెడిట్ ప్లాన్ ప్రకారం రూ.6644 కోట్ల రుణాల లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.1815 కోట్లు అందించి 27 శాతం లక్ష్యానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్లో గృహ నిర్మాణానికి రూ.80 కోట్లు, వానకాలం పంట రుణాలకు రూ.855 కోట్లు అందించడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.538 కోట్ల రుణాలకు, ఇప్పటి వరకు రూ.293 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను జిల్లాకు రూ.6362 కోట్ల క్రెడిట్ ప్లాన్ను రూపొందించడం జరిగిందన్నారు. కొందరు బ్యాంకర్లు వెనుకబడి ఉన్నారని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. వివిధ సంక్షేమ శాఖల లబ్ధిదారులకు 2014-15 నుంచి 2017-18 వరకు ఎస్సీ, ఎస్టీ. మైనార్టీ సంక్షేమ శాఖల లబ్ధిదారులకు సంబంధించిన పెండింగ్ యూసీలను అందించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి నెల రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
డిజిటల్ తెలంగాణలో భాగంగా ప్రతి వ్యాపారి నగదు రహిత లావాదేవీలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి వ్యాపారి వివరాలు సేకరించి డిజిటల్ విధానంలో లావాదేవీలు నిర్వహించే విధంగా బ్యాకర్లు కృషి చేయాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులు తమ పరిధిలోని గ్రామ కార్యదర్శుల సేవలను తీసుకుని ఈ నెల 6వ తేదీలోపు వివరాలను సేకరించి బ్యాంకర్లకు సమర్పించాలన్నారు. 2023-24 రుణ ప్రణాళిక బుక్లెట్ను కలెక్టర్, బ్యాంకర్లు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.