వికారాబాద్, నవంబర్ 26 : కోర్టుకు సంబంధించిన ఎలాంటి రికార్డులు పెండింగ్లో పెట్టవద్దని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. పీపీలు, పోలీస్స్టేషన్ అధికారులు జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో శిక్ష పడే శాతాన్ని పెంచాలన్నారు. అందుకు పోలీస్స్టేషన్ అధికారులు, పీపీలు ఒకరితో ఒకరు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎప్పటికప్పుడు రికార్డులను చెక్ చేసుకోవాలని సూచించారు. కేసుల దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్ అధికారులు చేసే తప్పులను కూడా పీపీ అధికారుల ద్వారా తెలుసుకున్నామన్నారు. ఎప్పుడైతే నేరం చేసిన వారికి శిక్ష పడుతుందో.. అప్పుడే ప్రజలకు పోలీసులపై, న్యాయస్థానంపై నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. కన్వెన్షన్ శాతాన్ని పెంచేందుకు పీపీ అధికారులకు జిల్లా పోలీస్ తరఫున ఎటువంటి సహకారమైనా అందిస్తామని.. జిల్లాలోని కేసులు కన్వెన్షన్ అయ్యేలా చూడాలని ఎస్పీ సూచించారు.