ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 : రంగారెడ్డిజిల్లాలో కుష్టు (లెప్రసీ)వ్యాధిగ్రస్తుల గుర్తింపు.. నివారణ చర్యల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. వ్యాధిని ప్రాథమిక దశలోనే బయటకు చెప్పుకోలేక తీవ్రమైన దశలో దవాఖానలను వ్యాధిగ్రస్తులు ఆశ్రయిస్తున్నారు. ఈ ఆలస్యాన్ని నివారించడానికి వీలైనంత త్వరగా వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందించడానికి జిల్లా వైద్యారోగ్యశాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇంటింటికీ సర్వే నిర్వహించి లెప్రసీ వ్యాధికి సంబంధించిన లక్షణాలున్నవారిని గుర్తించి వెంటనే తగిన చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేసింది. దీంతో వ్యాధి ప్రబలకుండా అరికట్టడానికి వీలవుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ప్రతీ ఆరోగ్య కార్యకర్త, ఆశావర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు నిర్వహిస్తారు.
జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ సర్వే
డిసెంబర్ 6 నుంచి 21 వరకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిర్వహించే ఇంటింటికీ సర్వేలో ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ముందుగా ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తారు. సర్వే కోసం వైద్య సిబ్బంది ఇంటికి వచ్చిన సమయంలో ఎవరైనా లేకపోయినప్పటికీ మరుసటి రోజు కూడా సర్వే నిర్వహించనున్నారు. లెప్రసీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియ జిల్లాలో ఉద్యమంలా సాగుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. డిసెంబర్ 6 వరకు జిల్లావ్యాప్తంగా కరపత్రాలు, ఇతరత్రా ప్రచారాలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రస్తుతం 135 మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స
జిల్లాలో ప్రస్తుతం 135 మంది లెప్రసీ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురు తక్కువ తీవ్రత ఉన్నవారు(పీబీ), 129 మంది ఎక్కువ వ్యాధి తీవ్రత ఉన్నవారు(ఎంబీ) ఉన్నారు. వీరందరికి సంబంధిత దవాఖానల్లో సరైన వైద్యసదుపాయాలు అందిస్తున్నారు. వీరికి పూర్తిస్థాయిలో చికిత్స అందించిన తర్వాతే బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, నగరంలోని పంజాగుట్ట దవాఖానల్లో మాత్రమే చికిత్స అందిస్తున్నారు.
జిల్లాలో 1168 మంది లక్షణాలున్నవారు..
జిల్లాలో ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 12 వరకు లెప్రసీ వ్యాధికి సంబంధించి ఇంటింటికీ పరీక్షలు నిర్వహించగా.. 1168 మందికి లక్షణాలున్నట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన రక్త నమూనాలను కూడా సేకరించి పరీక్షలు నిర్వహించగా 31 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. అందులో భాగంగానే డిసెంబర్ 6 నుంచి 21 వరకు లెప్రసీ వ్యాధి గుర్తింపునకు సంబంధించి పరీక్షలు నిర్వహించాలని భావించినట్లు జిల్లావైద్యారోగ్యశాఖాధికారి తెలిపారు. జిల్లాలో లెప్రసీ వ్యాధిని సమూలంగా రూపుమాపే కార్యక్రమంలో భాగంగా విడుతలవారీగా ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
పాల్గొననున్న 1142 బృందాలు
15 రోజులపాటు నిర్వహించనున్న సర్వేలో 1142 బృందాలు పాల్గొననున్నాయి. వీరిలో సుమారు 2084 మంది లెప్రసీ వ్యాధి నివారణ అధికారులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ఆశావర్కర్లు ఉంటారు. ప్రతి గ్రామంలో 2 నుంచి 3 బృందాలు పాల్గొంటాయి. లక్షణాలున్నవారి నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపనున్నారు. వ్యాధి నిర్ధారణ అయినవారందరినీ సంబంధింత దవాఖానలకు పంపించి వైద్యసేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు పకడ్బందీ పరీక్షలు
– వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి
జిల్లాలో డిసెంబర్ 6 నుంచి 21 వరకు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో కూడా గుర్తింపు కొనసాగింది. ప్రతి ఇంటిలో పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 135 మందిని గుర్తించి పూర్తిస్థాయిలో వైద్యసేవలందిస్తున్నాం. లెప్రసీ వ్యాధిపై ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు. ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించే అవకాశాలున్నాయి.