వికారాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ);సీఎం కేసీఆర్ సుపరిపాలనకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలూ జై కొడుతున్నారు. పార్టీలకతీతంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపే మేము సైతమంటూ అధికార పార్టీలో చేరుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ టీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్నది. ఇక వరుస చేరికలతో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా అవతరిస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు కనుమరుగవుతున్నాయి. శుక్రవారం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో బంట్వారం మండలంలోని 10 గ్రామాలకు చెందిన 400 మందికిపైగా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరగా.. శనివారం సైతం పరిగిలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో వందమంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంలో జిల్లా మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి పార్టీని ముందుండి నడిపిస్తుండగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, తాండూరు, పరిగి, కొడంగల్ ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి ఆయా నియోజకవర్గాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో జిల్లా అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు పలు పార్టీల నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యేల సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నారు.
ఓ వైపు ఎనిమిదేండ్లలో కనీవినీ ఎరుగని అభివృద్ధి, మరోవైపు దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో సబ్బండ వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్కు జైకొడుతున్నారు. దీంతో వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా తయారైంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ఆకర్షితులై ఒక్కొక్కరిగా ఇతర పార్టీలను వీడి టీఆర్ఎస్లోకి చేరుతున్నారు. చోటా, మోటా నేతల నుంచి కార్యకర్తల వరకు అంతా గులాబీ పార్టీవైపు క్యూ కట్టారు. అటు రాష్ట్రంలోగాని, జిల్లాలోగాని కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలకు కాలం చెల్లినట్లేనని గ్రహించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీవైపే ఆకర్షితులవుతున్నారు.
ప్రధానంగా వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో పెద్దఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కారెక్కుతున్న వారిని పార్టీలో చేర్చుకోవడంతోపాటు సముచిత స్థానం కల్పిస్తున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో బంట్వారం మండలం 10 గ్రామాలకు చెందిన ఇతర పార్టీలకు చెందిన 400 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి చేస్తున్న కృషితో టీఆర్ఎస్లో చేరేందుకు ఇతర పార్టీల శ్రేణులు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇటీవల పెద్దేముల్లో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సమక్షంలో కందనెల్లి, రుద్రారం, ఖానాపూర్ గ్రామాలకు చెందిన యువకులు పార్టీలో చేరారు.
మంత్రి కేటీఆర్ దత్తత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లోకి భారీగా చేరుతున్నారు. ఈ నెల 7న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో మద్దూర్ మండలం నందిపహాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కోస్గి మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పరిగి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కొప్పుల మహేశ్రెడ్డి చేస్తున్న కృషితో గత రెండు నెలల్లో వెయ్యికిపైగా నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్, కేటీఆర్ దిశానిర్దేశంతో జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి మార్గదర్శకంతో గత నాలుగైదు నెలలుగా ప్రతిరోజూ జిల్లా ఎమ్మెల్యేల సమక్షంలో పెద్దఎత్తున టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో…
దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా తయారైంది. దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా దళితులు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు దళిత బంధు., రైతులను అప్పుల ఊబి నుంచి కాపాడేందుకు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి వృద్ధులు, వితంతువుల పింఛన్ను రూ.200 నుంచి రూ.2016లకు, దివ్యాంగుల పింఛన్ను రూ.500 నుంచి రూ.3016లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే. ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల సంఖ్యతో నిమిత్తం లేకుండా కుటుంబంలో ఎంత మంది ఉన్నప్పటికీ అందరికీ ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సర్కారు పంపిణీ చేస్తున్నది.
మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు మిషన్ కాకతీయ, పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక చేయూతనందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఇవేకాకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది. సంక్షేమ పథకాలతోపాటు కోట్ల రూపాయలతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది. జిల్లాలోని ప్రతీ గ్రామానికి రోడ్లు వేయించడంతోపాటు గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లు, ప్రతీ గ్రామపంచాయతీలో సీసీ రోడ్ల ఏర్పాటుకు భారీగా నిధులు ప్రభుత్వం వెచ్చించింది. ఇలా ఎనిమిదేండ్లలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగడంతో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు అభివృద్ధికి ఆకర్షితులై కారెక్కుతున్నారు.