ఇబ్రహీంపట్నం, నవంబర్ 24 : విద్యార్థులు చిన్నతనం నుంచే విద్యతో పాటు వైజ్ఞానిక ప్రదర్శనలపై దృష్టి సారించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకంచ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం సైన్స్ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ గురుకులాల సెక్రటరీ రోనాల్డ్రాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్ర పరిశోధన రంగాల్లో విద్యార్థులు రాణించేందుకు ప్రోతహిస్తున్నదన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిశోధనల వల్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతుందన్నారు. ప్రతి పాఠశాలల్లోని తరగతి గదులు పరిశోధన కేంద్రాలు కావాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఎంతో ఉత్తమమైన పరిశోధకుడని, ఆవిష్కరణలపై దృష్టి సారించినప్పుడే అవి బయటకు వస్తాయని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయటం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదన్నారు. ప్రతి పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, అత్యాధునిక వసతులతో సైన్స్ల్యాబ్లు, లైబ్రరీలతో పాటు అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. ముఖ్యంగా గురుకులాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని ఆయన తెలిపారు. తెలంగాణ గురుకులాల సెక్రటరీ రోనాల్డ్రాస్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో చదివిన ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, కౌన్సిలర్లు బర్తాకి జగన్, మంద సుధాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.