వికారాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల కండ్లల్లో తెలంగాణ ప్రభుత్వం ఆనందం నింపనున్నది. వికారాబాద్ జిల్లా యంత్రాంగం అసలైన లబ్ధిదారులకు పట్టాలిచ్చేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే సర్వే ప్రక్రియను పూర్తి చేయగా, పల్లెపల్లెనా గ్రామ సభల్లో తీర్మానాలు చేసి, అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెలాఖరులోగా గ్రామ సభలను పూర్తి చేసి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులతోపాటు మూడు తరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనేతరులను గుర్తించి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను అందజేయనున్నారు. డివిజన్, జిల్లా స్థాయి కమిటీల ఆమోదం తర్వాత అర్హుల జాబితాను కలెక్టర్కు ఇవ్వనున్నారు. అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదం తెలిపి, ప్రభుత్వానికి తుది జాబితాను అందజేయనున్నది. జిల్లాలోని 114 గ్రామ పంచాయతీల్లోని 22,485 ఎకరాల పోడు భూములను 9973 మంది గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారు. వారు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
వికారాబాద్ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు త్వరలోనే పట్టాలిచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు వేగవం తం చేసింది. అందుకనుగుణంగా పోడు భూము ల సర్వే ప్రక్రియను పూర్తిచేసింది. సర్వేలో భాగం గా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు, గిరిజనులా, గిరిజనేతరులా, ఎన్ని ఎకరాల్లో సాగు చేసుకుంటారనే వివరాలను సేకరించారు. జిల్లాలోని 114 గ్రామపంచాయతీల్లో 22,485 ఎకరాల్లో పోడు భూములను 9973 మంది గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారు. అత్యధికంగా ధారూరు, యాలాల, కులకచర్ల, బషీరాబాద్, దుద్యాల మండలాల్లో పోడు భూములు ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న గిరిజనులతోపాటు మూడు తరాలుగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను అందజేయనున్నారు.
ప్రారంభమైన గ్రామసభలు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా యంత్రాంగం పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇప్పటికే పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను జిల్లా యంత్రాంగం స్వీకరించింది. దరఖాస్తులవారీగా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు సర్వే ప్రక్రియను కూడా పూర్తిచేసి నిజమైన పోడుదారులను ఎంపిక చేసేందుకు సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరులోగా జిల్లా అంతటా గ్రామ సభలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులకనుగుణంగా గ్రామసభల్లో పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు నుంచి సాగు చేసుకుంటున్నారా లేదనే పూర్తి వివరాలను గ్రామసభల్లో చర్చించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామసభల్లో తీర్మానం చేయనున్నారు.
ఆన్లైన్లో పోడు భూముల వివరాలు
పోడు భూముల సర్వే అనంతరం సంబంధిత వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నేరుగా ఆన్లైన్లో పొందుపర్చారు. పోడు భూముల సర్వేతోపాటు లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయి కమిటీలో పంచాయతీ కార్యదర్శి, అటవీ శాఖ బీట్ అధికారి, సర్వేయర్, తహసీల్దార్, డివిజన్స్థాయి కమిటీలో చైర్మన్గా ఆర్డీవో, సభ్యులుగా డీఎఫ్వో, డీజీటీవో, ఇద్దరు గిరిజన జడ్పీటీసీలు ఉండగా.. జిల్లాస్థాయి కమిటీకి చైర్మన్గా కలెక్టర్ వ్యవహరించనుండగా, సభ్యులుగా జిల్లా అటవీ శాఖ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి తదితరులుంటారు. గ్రామస్థాయిలో తీర్మానం అనంతరం డివిజన్ స్థాయిలో తీర్మానం చేసిన తరువాత జిల్లాస్థాయి కమిటీకి అర్హుల జాబితాను అందజేయనున్నారు. తుది జాబితాకు కలెక్టర్ నిఖిల ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదం తెలిపి, సంబంధిత పోడు సాగుదారుల జాబితాను ప్రభుత్వానికి అందజేయనున్నారు. తదనంతరం అర్హులైన పోడు రైతులకు ప్రభుత్వం పట్టాలను ఇవ్వనున్నారు.