రైతు బాగుంటేనే అందరూ మంచిగా ఉంటారని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేస్తున్నది. వ్యవసాయానికి సరిపడా సాగునీరు, నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తూ ఆదుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో తొమ్మిది గంటలపాటు విద్యుత్ను అందించగా.. 2017 జనవరి నుంచి 24 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నది. దీంతో వికారాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో 4.80 లక్షల ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకు పెరిగిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రోజుకు 3.78 మిలియన్ యూనిట్లు వినియోగమవుతుండగా.. ఏడాదికి 1,379 మిలియన్ యూనిట్లు ఖర్చవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మూడు లక్షల వరకు విద్యుత్ కనెక్షన్లుండగా అందులో 75 వేలు వ్యవసాయ కనెక్షన్లున్నాయి. నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యంగా జిల్లాలో రూ. వంద కోట్లతో సబ్ స్టేషన్లు, కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర విద్యుత్తో వ్యవసాయం పండుగలా మారిందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -వికారాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి తొలుత పగలు 6 గంటలు, రాత్రి 3 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేసేందుకు నిర్ణయించి అమలు చేసింది. తదనంతరం రాత్రి పూట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతానికి గురై మరణించడం తదితర ఇబ్బందికర ఘటనలతో రైతులకు ఇబ్బంది కలుగకుండా 2016 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయానికి 9 గంటలు సరఫరా చేసింది. 2017 జనవరి నుంచి జిల్లావ్యాప్తంగా నిరంతరం సరఫరా చేసేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నది.
గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ కోత విధించడం.. అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. బావులు, బోర్లలో నీళ్లుగా కరెంట్ లేకపోవడంతో రైతులు పంటలు నష్టపోయేవారు. దేశానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే అందరూ బాగుంటారన్న నిజాన్ని విస్మరించిన గత ప్రభుత్వాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నిరంతర విద్యుత్తు సరఫరాతో కళ్లు తెరిపించాయి. జిల్లాలో నిరంతర కరెంటుతో జిల్లాలో సాగు విస్తీర్ణం గతంలో 4.80 లక్షల ఎకరాలుండగా.. ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఐదేండ్లుగా నిరంతర సరఫరా..
జిల్లాలో గత ఐదేండ్లుగా వ్యవసాయానికి 24 గంటల పాటు సరఫరా చేస్తున్నారు. దీనికోసం రూ.100 కోట్లతో కొన్ని సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కొత్త లైన్లను వేయడం, మెగా ఓల్ట్ ఆంపియర్ల సామర్థ్యాన్ని కూడా పెంచింది. నిరంతర సరఫరాకు ముందు జిల్లాలో 400 మిలియన్ యూనిట్ల వినియోగముండగా.. ప్రస్తుతం ఏడాదికి 1379 మిలియన్ యూనిట్ల వినియోగమవుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రోజుకు ప్రస్తుతం 3.78 మిలియన్ యూనిట్లు ఖర్చవుతుండగా.. వేసవిలో 4-5 మిలియన్ యూనిట్లువినియోగమవుతున్నది.
జిల్లాలో పెరుగుతున్న కరెంట్ ఉత్పత్తి
తాండూరు, కొడంగల్, పుట్టపహాడ్, వికారాబాద్, పరిగి 132/23 కేవీ సబ్స్టేషన్ల ద్వారా 53.85 మిలియన్ యూనిట్లు., 132 కేవీ సబ్స్టేషన్ల ద్వారా 42.66 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుండగా.. ప్రైవేట్ పవన విద్యుత్తు, సోలార్ విద్యుత్తు సంస్థల ద్వారా 15 శాతం ఉత్పత్తి జరుగుతున్నది. జిల్లాలో కొత్తగడి, పీరంపల్లి, నస్కల్, పూడూర్, పరిగి, కొడంగల్, పెద్దేముల్ తదితర ప్రాంతాల్లో సోలార్, పవన విద్యుత్తు ప్లాంట్లు ఉన్నాయి. నిరంతర కరెంట్ సరఫరా చేసేందుకు కొత్తగా 58 33/11 కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడంతోపాటు సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. 5 ఎంఏలుగా (మెగాఓల్ట్ ఆంపియర్) ఉన్న సామార్థ్యాన్ని 8 ఎంఏలుగా మార్చి కొత్తగా 22 8 మెగా ఓల్ట్ ఆంపియర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని వికారాబాద్లో రెండు కొత్త లైన్లు, తాండూరులో 2 లైన్లు, పరిగిలో ఒక లైన్ ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 213 ఫీడర్లుండగా, వీటిలో 155 వ్యవసాయానికి సంబంధించినవి ఉన్నాయి. ఫీడర్ నుంచి ఫీడర్కు కొత్తగా 45 కొత్త లైన్లను ఏర్పాటు చేశారు.
ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్న చోట అదనంగా మరో ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా 50 వరకు ట్రాన్స్పార్మర్లను అదనంగా అందుబాటులో ఉంచారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినా.. ఇతర కారణాలతో సరఫరాలో అంతరాయం ఏర్పడినా.. వెంటనే పరిష్కరించేందుకు ఒక్కో డివిజన్కు ఒక్కో ప్రత్యేక బృందాన్ని జిల్లా విద్యుత్తు శాఖ నియమించింది. జిల్లాలో 3 లక్షల విద్యుత్తు కనెక్షన్లుండగా.. వీటిలో 75 వేలు వ్యవసాయ కనెక్షన్లున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా పోల్స్ వేయాల్సిన అవసరం లేనట్లయితే 4-5 రోజుల్లో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ను మంజూరు చేస్తున్నారు. ఒకవేళ కొత్తగా ట్రాన్స్ఫార్మర్స్తోపాటు పోల్స్ వేయాల్సి వస్తే మూడు నెలల సమయం పడుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.