వికారాబాద్, నవంబర్ 21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడుభూముల పరిష్కారానికి అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేసి, వారంలోగా గ్రామ సభలు పూర్తి చేసి తీర్మానాలు, నివేదికలు సబ్ డివిజనల్ లెవెల్ కమిటీకి పంపించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం పోడు భూములపై కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభలు నిర్వహించేటప్పుడు ఒత్తిడికి లోను కాకుండా స్క్రూటినీ చేయాలన్నారు. చాలామంది చాలా రోజుల నుంచి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారని, వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి వివరాలను గ్రామ సభ ఆమోదంతో ఎస్డీఎల్సీ కమిటీకి వారంలోగా అందజేయాలన్నారు.
జిల్లాలో ఆన్లైన్ ద్వారా 9973 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 4900 గిరిజనులు కాగా, మిగిలినవి ఇతర కులాలకు సంబంధించినవని తెలిపారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం 2005 కంటే ముందు సాగులో ఉన్న ఆధారాల ప్రకారం ఆమోదించాలన్నారు. గ్రామసభల్లో దరఖాస్తుదారులతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. గ్రామ సభలన్నీ వారం రోజుల్లో పూర్తి చేసి సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి అందించినైట్లెతే ఈ మాసాంతం వరకు అర్హులకు పట్టాలందజేసేలా చర్యలు చేపడుతామని వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమార్, డీఎఫ్వో వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి కోఠాజీ, సర్వే అండ్ ల్యాండ్ కార్డ్స్ అధికారి రామ్రెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులున్నారు.
ఆయుష్మాన్ భారత్ కార్డు జారీకై సత్వర చర్యలు చేపట్టాలి
దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్య సేవలు పొందేందుకు ఆరోగ్య శ్రీ కార్డు మాదిరిగా ఆయుష్మాన్ భారత్ కార్డు జారీకై సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ రూ.5లక్షల విలువ గల ఉచిత వైద్య సేవలు దేశంలో ఎక్కడైనా ఇంప్యానల్ ఉన్న ఆస్పత్రులలో పొందేలా గ్రామాల వారీగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ ఎన్రోల్మెంట్ చేయించి కార్డులు అందేలా చూడాలన్నారు.
జిల్లాలోని మోమిన్పేట, నవాబుపేట మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు చెప్పారు. సోమవారం నుంచి ఎంపీడీవో కార్యాలయాలలో ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీలకు ఉదయం 10 గంటల నుంచి మాస్టర్ ట్రెయినీలతో శిక్షణ ఇప్పించాలని సూచించారు. మొబైల్ ఫోన్ ద్వారా ఆయుష్మాన్ భారత్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని యూజర్ ఐడీ పాస్వర్డ్ల ద్వారా లబ్ధిదారులకు కార్డులు జారీ అయ్యేలా క్షేత్రస్థాయిలో పనులు చేపట్టాలన్నారు. వైద్య అధికారులు, సీడీపీవోలు అంగన్వాడీ సూపర్వైజర్లకు ఈ పనుల్లో పాల్గొని పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్కుమార్, ఆరోగ్యశ్రీ జిల్లా అధికారి డాక్టర్ పవన్కుమార్, వైద్యాధికారులు, కో ఆర్డినేటర్ వీరేశం ఉన్నారు.