రంగారెడ్డి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం పలు సామాజిక వర్గాల పునరావాసానికి కృషి చేయడమే కాకుండా, వారి బతుకులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నది. కుల వృత్తుల వారికి చేయూతనిస్తున్నది. అందులో భాగంగానే పశువుల్లో వస్తున్న రోగాలకు చెక్ పెడుతూ వ్యాక్సిన్లు ఇస్తున్నది. జిల్లాలో పశు సంరక్షణకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతున్నది.
గోజాతి, గేదె జాతి పశువులకు గత నెల 22 నుంచి ఈ నెల 2 వరకు జిల్లా అధికార యంత్రాంగం వ్యాధి నిరోధక టీకాలు వేసింది. ఇప్పటి వరకు 1,27,477 పశువులకు టీకాలు వేశారు. ఇవే కాకుండా జిల్లాలో ఇప్పటికే 2,31,567 గొర్రెలు, మేకలలో నీలి నాలుక వ్యాధులు రాకుండా ఉచితంగా అధికార యంత్రాంగం వ్యాధి నిరోధక టీకాలు వేసింది. ప్రస్తుతం గొర్రెలకు షీప్ పాక్స్ వ్యాధి సోకి వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నది. వ్యాధులకు గురైన గొర్రెల నుంచి మందలోని మిగతా గొర్రెలు, మేకలకు సంక్రమించే అవకాశాలున్నాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. వివిధ గ్రామాలకు చెందిన రైతులు వెంటనే అధికారులతో సంప్రదించి రోగ నిరోధక చర్యలు చేపట్టాలి.
మశూచి వ్యాధి/బొబ్బ రోగం
ప్రధానంగా గొర్రెలకు ప్రస్తుతం వస్తున్న వ్యాధి మశూచి లేదా బొబ్బ రోగం. దీనినే అమ్మ తల్లి (షీప్ పాక్స్) అని కూడా అంటారు. ఈ రోగం తీవ్రతను బట్టి 106 డిగ్రీల నుంచి 108 డిగ్రీల వరకు జ్వరం వస్తుందని పశు వైద్య శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన గొర్రెలు మేత తినవు, నెమరు వేయవు, కండ్ల నుంచి నీరు కారి వూసులు కడతాయి. పెదవులు, తల వాస్తాయని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో చెంపలు, తొడలు, పొదుగు, తొడ కింది భాగం, జననేంద్రియాలు, చెవులపై గుండ్రని, ఎర్రటి కురుపులు ఏర్పడుతాయి. ఈ వ్యాధి క్రమంగా శ్వాసకోశం, పేగులకు బొబ్బలు వ్యాపించి, గొర్రెలు దగ్గతూ పడుకుంటాయి. చూడి గొర్రెల్లో గర్భస్రావం కలుగుతుంది. చిన్న గొర్రె పిల్లల్లో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వెంటనే వేరు చేసి, బొబ్బలకు వేప నూనె, రోజూ కండరానికి వ్యాక్సిన్, మూడు లేక ఐదు రోజుల జ్వర తీవ్రత తగ్గించడానికి ఇప్పించాలని అధికారులు చెబుతున్నారు. వ్యాధి నివారణకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ యంత్రాంగం వారు ఉచితంగా సరఫరా చేయబడిన షీప్ పాక్స్ టీకా గొర్రెలకు వేయించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆరున్నర లక్షల గొర్రెలకు వ్యాక్సిన్లు
రంగారెడ్డి జిల్లాలో 27 మండలాల్లో 558 గ్రామాలున్నాయి. ఒక్కో గ్రామంలో గొర్లు, మేకల మందలు ఉన్న కుటుంబాలు కనీసం నలుగురు లేదా ఐదుగురైనా ఉంటారు. ఇలా జిల్లా మొత్తం మీద 6,50,000 లక్షలకు పైగా గొర్రెలు, మేకలున్నాయి. వీటన్నింటికీ వ్యాక్సిన్లు వేసేందుకు జిల్లా పశు వైద్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గొర్ల మందలు, మేకల మందల యజమానులు, కాపరులు సకాలంలో స్పందించి వాటికి రోగ నిరోధక టీకాలు వేయించాలని అధికారులు కోరుతున్నారు. ఈ వ్యాధి నిరోధక టీకాలు ఈ నెల 25 వరకు వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గొర్రెలు, మేకలున్న అన్ని గ్రామాల రైతులు వారి గొర్రెలకు షీప్ పాక్స్ టీకా మందులు వేయించుకోవాలని కోరుతున్నారు.