నందిగామ, నవంబర్ 20 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం బుగ్గోనిగూడ గ్రామం నుంచి కన్హాశాంతి వనం వరకు రూ.3.73 కోట్ల సీఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్డు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదన్నారు. ప్రతి గ్రామానికీ బీటీ రోడ్లు, సీసీ రోడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అదే విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల రూపురేఖలను మార్చిందన్నారు.
ప్రతి గ్రామంలో ప్రజలకు కావాల్సిన అన్ని విధాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. అభివృద్ధి పనులకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంక, మాజీ ఎంపీపీ శివశంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ విఠల్, సర్పంచ్ గోవిందు అశోక్, జట్ట కుమార్, నాయకులు బుగ్గ నర్సింహ, బండి రాజు, వీరేందర్గౌడ్, సాములయ్య, మల్లేశ్, దేవప్ప, శ్రీనివాస్, సాలయ్య, యాదయ్య, రవి, శేఖర్ పాల్గొన్నారు.
వన భోజన కార్యక్రమం
నందిగామ మండలం వెంకమ్మగూడ గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తికమాస వన భోజనాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి వన భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.