సబ్బండ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తున్నది. గిరిజనులు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో ట్రైకార్ ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తున్నది. అర్హులైనవారు ఎద్దుల బండి, ఎరువుల దుకాణం, ట్రాక్టర్లు, కోత యంత్రాలు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, బోర్, మొబైల్ మెకానిక్ తదితర దుకాణాలు, పచ్చళ్ల తయారీ, పిండి గిర్నీ తదితర యూనిట్లను నెలకొల్పేందుకు రాష్ట్ర సర్కార్ చేయూతనందిస్తున్నది. గత రెండేండ్లుగా రంగారెడ్డి జిల్లాలో 2,259 మంది దరఖాస్తు చేసుకోగా, 1,013 మందికి వారు ఎంపిక చేసుకున్న యూనిట్లకుగాను రుణాలిచ్చేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. యూనిట్ను బట్టి రూ. లక్ష నుంచి రూ.పది లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉన్నది.
రంగారెడ్డి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పలు సామాజిక వర్గాల అభ్యున్నతికి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెస్తూ వారివారి పురోభివృద్ధికి పాటుపడుతున్నది. ఇందులోభాగంగా గిరిజనుల సంక్షేమాభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను ఆచరణలోకి తెచ్చింది. గిరిజనుల ఆర్థిక ప్రగతికి చేయూతనిస్తూ పేదరికాన్ని రోజువారీగా రూపుమాపేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో అడుగులు వేస్తున్నారు. గిరిజన తండాలు, పలు గూడేల్లో ఉంటున్న గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ట్రైకార్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా వారిని అభివృద్ధిపథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం గిరిజనుల అభివృద్ధికిగాను రెండు యాక్షన్ ప్లాన్లు కొనసాగుతున్నాయి.
అర్హులైన నిరుపేద గిరిజనులకు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అందేలా జిల్లా అధికార యంత్రాంగం ఆర్థిక ప్రణాళికలను అమలు చేస్తున్నది. జిల్లాలోని మండల పరిషత్తు అభివృద్ధి అధికారుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపికలు కొనసాగనున్నాయి. జిల్లాలో 1,013 మందికిగాను వివిధ కేటగిరీల్లో ఉపాధిని కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు కొనసాగిస్తున్నది.
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన నివాసాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఆర్ఐసీఓఆర్-ట్రైకార్) ఆర్థిక సహకార పథకం కింద రుణ సహాయం అందించేందుకు 2020-21(రూ.2,62,06,000), 2021-22(రూ.9,87,92,000) ఆర్థిక సంవత్సరాలకుగాను యాక్షన్ ప్లాన్ను ఇప్పటికే విడుదల చేయగా.. ఇందుకు 2,259 మంది గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఎంపిక (సెలక్షన్స్)ను ప్రారంభించింది. జిల్లాలోని ప్రతి మండలంలో జనాభా ప్రాతిపదికన ఎంపీడీవో ఆధ్వర్యంలో సెలక్షన్స్ జరుగుతున్నాయి.
గిరిజన సంక్షేమంలో భాగంగా లక్ష రూపాయల వరకు గల యూనిట్ నెలకొల్పుటకు ప్రభుత్వం 80%, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు 70%, రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు 60% సబ్సిడీని ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుంది. రూ.2లక్షల నుంచి రూ.10 లక్షల వరకు గల యూనిట్ కాస్ట్లో రూ.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. ఇప్పటికే ఎంపికైన పలు యూనిట్లకు ఆర్థిక సహకారం అందాల్సి ఉంది.
ఈ గిరిజన ఆర్థిక మద్దతు స్కీమ్లో మూడు సెక్టార్లలో ఉపాధి పొందేందుకు అవకాశాలున్నాయి. వ్యవసాయం విభాగంలో ‘ఎద్దుల బండి, ఎరువుల దుకాణం, ట్రాక్టర్లు, కోత మిషన్ల’ను లబ్ధిదారులకు అందించనున్నారు. ఇంకా యానిమల్ హస్బెండరీ విభాగంలో ‘పాలిచ్చే జంతువులు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు’ మొదలైనవి, మైనర్ ఇర్రిగేషన్లో ‘బోర్, మొబైల్ మెకానిజమ్ దుకాణం’ పెట్టుకొని లబ్ధిదారులు ఈ స్కీమ్ ద్వారా పొంది ఉపాధి పొందే అవకాశాలున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో భాగంగా ‘పలు మెకానిక్ దుకాణాలు, చిన్న పిండి గిర్నీలు, పచ్చళ్ల తయారీ కేంద్రాలు’ పెట్టుకొనేందుకు ఈ స్కీమ్లో ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించనున్నది. జిల్లాలో 2,259 మంది నిరుపేద గిరిజనులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే 266 యూనిట్లకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. మిగిలినవాటి ప్రాసెస్ కొనసాగుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి దారులు వేస్తున్నది. ప్రధానంగా నిరుపేదలైన గిరిజనుల కోసం పలు రకాల రాయితీలను కల్పిస్తూ వారు ఆర్థికంగా రాణించాలని ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవే ట్రైకార్ ఆధ్వర్యంలో చేపట్లే ‘ఎకానామిక్ సపోర్ట్ స్కీమ్స్’. ఈ స్కీమ్లకు సంబంధించి జిల్లాలో ఇప్పటికే వివిధ సెక్టార్లలో 2,259 మంది దరఖాస్తు చేసుకున్నారు. 266 యూనిట్లకు ఎంపికలు పూర్తయ్యాయి. ఇంకా వారి అకౌంట్లలోకి ఆర్థిక సాయం అందాల్సి ఉంది. మిగిలిన వాటికి ప్రతి మండలంలోని ఎంపీడీవోల ఆధ్వర్యంలో కసరత్తు కొనసాగుతున్నది.
– కేఈ రామేశ్వరీదేవి, రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి