పెద్దేముల్, నవంబర్ 16 : గ్రామీణ ప్రాంతాల్లో కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కృషి చేయాలని జిల్లా డీపీఎంవో ఈశ్వరయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని మంబాపూర్, పెద్దేముల్ పీహెచ్సీలను రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన బృందం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను,రిపోర్టులను పరిశీలించారు. అనంతరం ప్రజలకు కుష్ఠు వ్యాధి నిర్మూలన, వ్యాధి లక్షణాలు, నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై వివరాలను అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన బృందం సభ్యులు పలువురు మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి బహుళ ఔషద చికిత్స(ఎండీటీ) అందించినట్లయితే కుష్ఠు వ్యాధి రాకుండా రోగిని కాపాడవచ్చన్నారు. ఈ వ్యాధి మైక్రో బ్యాక్టీరియన్ లెప్రసీ అనే సూక్ష్మజీవుల నుంచి సోకుతుందని, తుంపర్లు, దగ్గినా, తుమ్మినా వ్యాప్తి చెందుతుందని, స్పర్శ లేని మచ్చలే కుష్ఠు వ్యాధి లక్షణాలన్నారు. ఈ వ్యాధి లక్షణాలు 3 నుంచి 7 సంవత్సరాల వరకు బయటపడవని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 94 మందికి కుష్ఠు వ్యాధి ఉందని,అందులో ఎక్కువగా అంగడీరాయ్చూర్లో 12 మందికి తదుపరి పెద్దేముల్, ధారూర్లో ఎక్కువగా ఉందన్నారు. ఈ తనిఖీల్లో ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్ యాదవ్, రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన టీమ్ సభ్యులు లోకేందర్, నర్సింహారెడ్డి, లూర్ధు, అరుణ, డీపీఎంవో ఈశ్వరయ్య, సూపర్ వైజర్ పుష్పలత, ఏఎన్ఎం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.