వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీలో రూ.2.02 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకంతో వికారాబాద్ జిల్లాకు సాగునీటిని అందిస్తాం.. జిల్లాలో వ్యవసాయ సాంకేతిక కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం… సంక్షేమ పథకాలతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతున్నది.. తెలంగాణలో ఒకప్పుడు దండుగ అన్న వ్యవసాయం.. నేడు పండుగైంది.. దేశంలోనే వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్రం మనదే..’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీలో రూ.2.02 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. జిల్లాలోని భూములు అన్ని పంటల సాగుకు అనుకూలమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు, రైతు బీమా, నిరంతర ఉచిత విద్యుత్తో అన్నదాతల్లో మనోధైర్యం నెలకొన్నదన్నారు. వికారాబాద్ మార్కెట్ అభివృద్ధికి 20, 25 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తే సీఎం కేసీఆర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సాంకేతిక పద్ధతిలో సాగు చేసేలా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని మంత్రి అధికారులకు సూచించారు.
వికారాబాద్, నవంబర్ 16 : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ.2.02కోట్లతో మార్కెట్ కమిటీలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు వర్షాధార పంటలను సాగు చేస్తుంటారు. రైతులకు పంట పెట్టుబడికి రైతు బంధు, పంటకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 24గంటల ఉచిత కరెంట్, తదితర సౌకర్యాలు కల్పించడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. మార్కెట్లో అధికంగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి లాభాలు పొందాలని సూచించారు.
సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. వికారాబాద్ మార్కెట్ అభివృద్ధికి 20 నుంచి 25 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ వంటి తదితర ధరలు పెంచి పేద రైతులను మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని ఎద్దేవా చేశారు. జిల్లాలో వ్యవసాయ సాంకేతిక కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేపంటలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటున్నట్లు చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు సాగు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ అనంతగిరిలో ఏర్పాటు చేసే మెడికల్ కళాశాలకు రూ.235కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీపాభక్తవత్సలం మాట్లాడుతూ వికారాబాద్ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ధాన్యం నిలువ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంజూరైన రూ.2.02 కోట్లతో మార్కెట్ ఆవరణలో అదనపు 20 షాపులు, సీసీ రోడ్లు తదితర నిర్మాణాలు చేపట్టేందుకు వినియోగిస్తామని తెలిపారు.
అనంతరం ఆసరా పింఛన్లను మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్కుమార్గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, వ్యవసాయ ఉప సంచాలకులు పద్మహర్ష, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, కౌన్సిలర్ పుష్పలతారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీడీవో సత్తయ్య, కౌన్సిలర్ అనంత్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.