మొయినాబాద్, నవంబర్15 : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుభోదయం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో పర్యటించారు. అంతకు ముందు గ్రామంలో నూతనంగా రూ.20 లక్షలతో చేపట్టనున్న అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను ఎంపీపీ గునుగుర్తి నక్షత్రంతో కలిసి ప్రారంభించారు. అనంతరంగా గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో విద్యుత్ సమస్య ఉందని అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.
విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్ సర్వీస్ సరిగా లేకపోవడంతో బస్ సర్వీస్లు సక్రమంగా నడిపే విధంగా కృషి చేయాలని గ్రామస్తులు కోరారు. ఎమ్మెల్యే వెంటనే మెహిదీపట్నం, రాజేంద్రనగర్ డిపో మేనేజర్లకు ఫోన్ చేసి గ్రామానికి బస్ సర్వీస్లను పునరుద్ధరించాలని ఆదేశించారు. మత్స్యకారులు తదితరులు వివిధ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, దశల వారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో గ్రామానికి ఆనుకొని ఉన్న ఈసీ వాగుపై సుమారుగా రూ.3 కోట్లు ఖర్చు చేసి చెక్ డ్యామ్ నిర్మించామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ మనోజ్కుమార్, ఎంపీటీసీ పట్నం రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్కుమార్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జి జయవంత్, ఎంఏ రావూఫ్, ఏఎంసీ డైరెక్టర్ ఆంజనేయులు, వార్డు సభ్యులు ఎం శంకర్, శకుంతల, కళమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, నాయకులు బాల్రాజ్, శ్రీనివాస్, అశోక్, రమేశ్ పాల్గొన్నారు.