ఏటేటా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉపాధి హామీ పనులను పాతరేస్తున్నది. తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పని దినాలను తగ్గిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోటీ 3 లక్షల పనిదినాలను కల్పించగా, ఈ ఏడాది కూలీల పొట్ట కొడుతూ 31.41 లక్షల పని దినాలను తగ్గిస్తూ 71.58 లక్షల పని రోజులను మాత్రమే కల్పించాలని నిర్ణయించడం బాధాకరం. వచ్చే ఏడాది మరో 20 లక్షల మేర పని దినాలను తగ్గిస్తూ 50 లక్షల పనిదినాలను కల్పించాలని ప్రణాళికను సిద్ధం చేయడంపై బీజేపీ సర్కార్పై కూలీలు దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్వేర్తో జిల్లాలోని లక్షల కుటుంబాలను ఉపాధి పనులకు దూరం చేసి వారిని గోసపెడుతున్నది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై రాబోవు రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– వికారాబాద్, నవంబర్ 15, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువచ్చారు. కరువును అధిగమించడమే లక్ష్యంగా గత కొన్నేండ్లుగా నిరుపేదల కడుపు నింపేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఉపాధి హామీ తనిఖీల పేరిట పలు జిల్లాల్లో పనులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బృందాలు క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు భిన్నంగా తప్పుడు రిపోర్ట్లతో ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిలిపివేసే కుట్ర పన్నుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాలతో ఉపాధి హామీ పనులనే నమ్ముకొని బతుకుతున్న కూలీలకు పనులు దూరమయ్యాయి. ఉపాధి హామీ పనులను భారీగా తగ్గించిన కేంద్రం వేల కుటుంబాల కడుపు కొడుతున్నది. కొత్త నిబంధనలపై జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలందరూ మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుండడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 2,00,372 ఉపాధి హామీ కుటుంబాలుండగా.. 4,38,398 మంది కూలీలున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్వేర్తో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది, వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీగా పని దినాలను తగ్గిస్తూ ప్రణాళిక రూపొందించడం గమనార్హం. కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం పనులకు తప్పనిసరిగా హాజరుకావాలని షరతులను విధించింది. కూలీలు చేస్తున్న పనులకు సంబంధించి ఉదయం 11 గంటలలోపు ఒక ఫొటో, సాయంత్రం 2 గంటల తర్వాత రెండో ఫొటో తప్పనిసరిగా తీయడంతోపాటు అప్లోడ్ చేస్తున్నారు.
ఒక గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒక పని పూర్తైన తర్వాతనే మరొక పని చేపట్టాలని నిబంధన విధించారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. ప్రతిరోజూ చేపడుతున్న పనులను వెంటనే యాప్లో పొందుపర్చాలనే నిబంధనలతో క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేకపోవడంతో అప్లోడ్ చేయడం ఇబ్బందిగా మారి పనుల్లో జాప్యం ఏర్పడుతున్నది.
మరోవైపు రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడంతో కల్లాలు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కల్లాల ఏర్పాటు ప్రక్రియను కూడా కేంద్రం ఉపాధి హామీ పథకం నుంచి తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం వేల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి.
జిల్లావ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడుస్తున్నా కనీసం వెయ్యి రోజుల పనిని కూడా కల్పించలేకపోయారు. గతేడాది 19,998 కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు కేవలం 846 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనులను కల్పించారు. జిల్లాలోని వికారాబాద్, మర్పల్లి, కొడంగల్, బొంరాస్పేట్ మండలాల్లో 100 కుటుంబాలకుపైగా వంద రోజులపాటు పనిని కల్పించగా.. మిగతా 16 మండలాల్లో సింగిల్, డబుల్ డిజిట్లోనే కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు.
రెండేండ్లలో 50 లక్షల పనిదినాలు తగ్గింపు
లక్షల మంది పేద కుటుంబాల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చి పథకాన్ని నిలిపివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. ఇందులో భాగంగానే తప్పుడు నివేదికలు తెప్పించుకొని అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రచారం చేసి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే గతేడాది నుంచి ఉపాధి హామీ పనిదినాలను భారీగా తగ్గిస్తున్నారు. కేవలం రెండేండ్లలో 50 లక్షల పనిదినాలను జిల్లాలో తగ్గించారంటే ఉపాధి హామీ పథకంపై మోదీ ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 2021-22లో 1.03 లక్షల పనిదినాలను కల్పించగా.. ఈ ఏడాది 31.41 లక్షల పనిదినాలను తగ్గిస్తూ 71.58 లక్షల పనిదినాలను కల్పించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మరో 20 లక్షల మేర పనిదినాలను తగ్గిస్తూ 50 లక్షల పనిదినాలను కల్పించాలని ప్లానింగ్ సిద్ధం చేశారు.
కొత్త నిబంధనలు పెట్టి పొట్టకొడుతున్నది– రాములు, ఉపాధి హామీ కూలీ, పెద్దేముల్
కేంద్ర ప్రభుత్వం గతంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి ఉపాధి కూలీకి 100 రోజుల పనులు కల్పించేది. ప్రస్తుతం కొత్త నిబంధనలు తీసుకురావడంతో ప్రతి కూలీకి 100 రోజుల పనులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గింది. మరోవైపు చెరువుల్లో ఉపాధి హామీ కూలీలు పనులు చేయొద్దని ఆదేశాలివ్వడం విడ్డూరం. మొత్తానికి ఉపాధి హామీ కూలీల పొట్టకొడుతున్నది.
త్వరగా డబ్బులు రావడంలేదు– వీరేందర్, ఉపాధి హామీ కూలీ, ఎర్రగడ్డతండా
గతంలో ఉపాధి హామీలో భాగంగా గ్రామస్థాయిలో కూలీ పనులకు వెళ్లిన తరువాత డబ్బులు వారం రోజుల్లో మా బ్యాంక్ అకౌంట్లో పడుతుండే. కేంద్రం కొత్త నిబంధనలు పెట్టడంతో సరైన సమయానికి డబ్బులు రావడంలేదు. పోస్టాఫీసుకు అకౌంట్ను అనుసంధానం చేస్తేనే డబ్బులు వస్తున్నాయి లేకుంటే రావడం లేదు. ఆ పని చేయొద్దు.. ఈ పని చేయొద్దు అనే ఆంక్షలు పెట్టడం సరికాదు. కొత్త నిబంధనలతో కూలీల నోటికాడి ముద్ద గుంజుకుంటున్నది.