ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 13 : అన్నదాతలు పూర్వం వరిచేళ్లను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. అంతే కాకుండా అప్పటి రోజుల్లో పశువులు ఎక్కువగా.. వరిసాగు తక్కువగా ఉండటంతో పశుగ్రాసం కుప్పలు కుప్పలుగా పెట్టుకునేవారు. ప్రస్తుతం సాగు విధానంలో అనేక మార్చులు వచ్చాయి. యంత్రాలను విరివిగా ఉపయోగిస్తుండటంతో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మిషన్తో హార్వెస్టింగ్ చేసే సమయంలో పైకి కోయడం ద్వారా కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ప్రారంభమైనందున రైతులు ఎంతో కొంత గడ్డిని తెచ్చుకుకోవడం, మిగిలిన దానిని అక్కడే వదిలివేస్తున్నారు. దీంతో దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరికొయ్యలతో పాటు గడ్డిని కాలబెడుతున్నారు. దీనివల్ల అధిక నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రైతులు పొలాన్ని కలియదున్నితే అధిక దిగుబడి సాధించవచ్చునని వ్యవసాయాధికారులు సూచి స్తున్నారు.
రైతులు చాలామంది వరినాటు వేసే సమయంలో మొదటి దఫా దున్నుడుకు, రెండో దఫా దున్నుడుకు మధ్య నాలుగు నుంచి ఐదురోజుల సమయం మాత్రమే తీసుకుం టారు. దీనివల్ల కొయ్యకాలు, గడ్డి త్వరగా కుళ్లిపోవు. ఇలాంటి సమయంలో పశువులను అందులో వదిలితే అటు తిరు గడం, పొలంలో పేడ, మూత్ర విసర్జన చేయడం ద్వారా త్వర గా కుళ్లి భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి 5 శాతం పెరుగుతుంది. లేదంటే అందులోనే కలియదున్ని కనీసం ఎనిమిది రోజుల సమయం తీసుకుని రెండు దఫా దున్నాలి. వీలైతే మొదటి దఫాలో ఒక్కసారి రోటోవేటర్తో దున్నితే గడ్డి, కొయ్యకాలు చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి మళ్లీ దున్నినప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు. దున్నే ముందు ఎకరానికి క్వింటాల్ సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లితే కొయ్యలు, గడ్డి త్వరగా కుళ్ల్లిపోతాయి. జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు వేసి ఏపుగా పెరిగిన తర్వాత కలియదున్నితే భూమి సారవంతంగా మారుతుందని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.
కొయ్యలు కాల్చటం భూమికి తీవ్ర నష్టం
రైతులు వరికొయ్యలు కాల్చటం ద్వారా భూసారం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. మంటల ద్వారా విపరీతమైన వేడితో భూమి భూసారాన్ని కోల్పోతుంది. ముఖ్యం గా నత్రజని, పాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషా లు కాలిపోతాయి. పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. పొలాల్లో తిరిగే పాములు, ముంగీస లు, ఉ డుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసు లు చనిపోయే ప్రమాదం అధికంగా ఉన్నందున రైతులు వరికొయ్య లు కాల్చటం పూర్తిగా మరిచిపోవాలి. ప్రస్తుతం వర్షాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నందున ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
ఇలా చేస్తే అధిక ప్రయోజనాలు
వరికొయ్యలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బనశాతం పెరిగి దిగుబడులు 5నుంచి 10శాతం పెరిగే అవకాశముంది. దుక్కి దున్నే సమయంలో సింగిల్ సూపర్ పాస్పేట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది.
కలియ దున్నితే మేలు
మొక్కలకు 2శాతం నత్రజని (యూరియా) 4శాతం పాస్పరస్ అదనంగా అందిస్తుంది. జింక్, మాంగనీజ్, ఇను ము, కాల్షియం లాంటి సూక్ష్మదాతువులు పంటకు మేలు చేకూర్చుతాయి. నేలలో కరుగని మూలకాలనూ పంటకు అనుకూలంగా మార్చుతుంది. నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
కాల్చకుండా కలియ దున్నాలి
ప్రస్తుతం రైతులు వర్షాకాలం పంటల సాగులో భాగంగా వేసిన వరిపంట చేతికొచ్చినందున వరిపంటలు కోసే పనులు ప్రారంభించారు. కోతల అనంతరం పొలాలను సిద్ధం చేసుకునే రైతులు తమ వ్యవసాయ పొలాల్లోని వరికొయ్యలను తగులబెట్టకుండా భూమిని కలియదున్నటం ద్వారా ఇది సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. వరికొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల గాలి, నేల కలుషితమవుతుంది. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు మరణిస్తాయి. కొయ్యకాలును పొలంలో కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. దున్నే ముందు తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లితే కొయ్యలు, గడ్డి మొక్కలు తొందరగా కుళ్లిపోతాయి. మురిగిన కొయ్యకాలు ఎరువుగా మారడటంతో దిగుబడి పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించవచ్చు.
– రఘు, వ్యవసాయశాఖ ఏఈవో ఇబ్రహీంపట్నం