వికారాబాద్, నవంబర్ 6, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. గ్రామీణ మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన విలేజ్ ఎంటర్ప్రైజెస్ల ఏర్పాటు ప్రక్రియ జిల్లాలో వేగవంతం అయ్యింది. విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2252 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలుగా మారారు.
జిల్లాలో ఎంపిక చేసిన సంఘాల సభ్యుల్లో 80 శాతం మేర స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు. విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలోనే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలను మొదలుపెట్టారు. వ్యాపారాల్లో నష్టం వాటిల్లకుండా ఎస్హెచ్జీ సభ్యులు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణను కూడా సంబంధిత అధికారులు ఇప్పించారు. ఎస్హెచ్జీ సభ్యులకు రుణాలను బ్యాంకులు, సెర్ప్, స్త్రీనిధి ద్వారా ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. జిమహిళా సంఘాల సభ్యులకు రుణాల నిధులను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.
ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి 4 లక్షల వరకు..
ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపారం చేసేందుకు ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. జిల్లాలో విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా 2888 ఎస్హెచ్జీ సభ్యులను ఎంపిక చేయగా ఇప్పటివరకు 2252 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలను ప్రారంభించగా.. మిగతా 636 మంది ఈ నెలాఖరులోగా ప్రారంభించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు స్వయం సహాయక సంఘాల సభ్యులు గ్రామాల్లో స్థానిక పరిస్థితులను బట్టి వ్యాపారం మొదలుపెట్టారు.
వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఎస్హెచ్జీ సభ్యులు నష్టపోకుండా వారు ఎంచుకున్న వ్యాపారాలకు సంబంధించి వ్యాపార మెళకువలు, నైపుణ్యాన్ని కూడా సెర్ప్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఉత్పత్తి, ట్రేడింగ్, సర్వీసు రంగాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించి ఎస్హెచ్జీ సభ్యులకు శిక్షణనిప్పించారు. ఒక గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఒకే రకమైన వ్యాపారం చేసేందుకు వీలు లేకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టే ప్రతి సభ్యురాలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారం చేసేలా అధికారులు నిర్ణయించిన విధంగానే వ్యాపారాలు షురూ అయ్యాయి.
పలు రంగాల్లో వివిధ రకాల వ్యాపారాలు
ఉత్పత్తి రంగంలో పేపర్ ప్లేట్లు, బేకరీ, ఇటుకల తయారీ, విస్తరాకు తయారు యంత్రం, పాపడ్, స్నాక్స్ యూనిట్, బాస్కెట్ తయారు, రోటీ తయారు, స్టేషనరీ, ఫ్లోర్ క్లీనర్, రైస్ మిల్, చేనేత ఉత్పత్తి పరిశ్రమల వ్యాపారాలు.. అదేవిధంగా ట్రేడింగ్ రంగంలో కిరాణా దుకాణం, బట్టల వ్యాపారం, గాజుల దుకాణం, ఫ్యాన్సీ స్టోర్, కూరగాయల వ్యాపారం, డెయిరీ, పౌల్ట్రీ, గుడ్ల వ్యాపారం, ఫెర్టిలైజర్ దుకాణం, హార్డ్వేర్ షాప్, ఎలక్ట్రికల్ షాప్ వ్యాపారాలు.. సర్వీసు రంగంలో హోటల్, టిఫిన్ సెంటర్, టైలరింగ్, మటన్, చికెన్ షాప్, పిండి గిర్ని, వాటర్ ప్లాంట్, పాల వ్యాపారం, బ్యూటీ పార్లర్, మొబైల్ ఫోన్ మెకానిక్, మెడికల్ షాప్, టెంట్ సైప్లె సర్వీసు, వెల్డింగ్ షాప్, కెమెరా ఫొటో స్టూడియో తదితర వ్యాపారాలను జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు మొదలుపెట్టారు. మరోవైపు జిల్లాలో 657 గ్రామసంఘాలు, 20,294 స్వయం సహాయక సంఘాలుండగా 1,63,321 లక్షల మంది సభ్యులున్నారు.
వ్యాపారులుగా మారిన 2252 మంది ఎస్హెచ్జీ సభ్యులు
విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోని స్వయం సహాయక సంఘాల్లో ఆసక్తిగల వారిలో ముగ్గురి చొప్పున ఎంపిక చేసి, వారికి స్వయం ఉపాధి కల్పనలో కొత్తకొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు అవసరమైన నైపుణ్యాలు, ఆర్థిక వనరులను కల్పించి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమానికి సెర్ప్ శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటివరకు 2252 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా మారారు. ఎస్హెచ్జీలు ఉత్పత్తి సంబంధిత వ్యాపారాలతోపాటు వాణిజ్య, వర్తక వ్యాపారాలు, సేవాపరమైన వ్యాపారాలను ప్రారంభించారు. సంబంధిత 2252 మందికి వ్యాపారాలను నిర్వహించుకునేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా రూ.20 కోట్ల రుణాల వరకు అందజేశారు.
సుస్థిర జీవనోపాధి కల్పించడమే లక్ష్యం
– జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి కృష్ణన్
గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఎంటర్ప్రైజెస్లో భాగంగా 4833 మంది ఎస్హెచ్జీలను వ్యాపారులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకోగా.. జిల్లాలో ఎంపిక చేసిన సభ్యుల్లో 80 శాతం వరకు ఎస్హెచ్జీలకు రుణాలను మంజూరు చేసి ఎంపిక చేసుకున్న యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాం.
నేడు ప్రజావాణి రద్దు
వికారాబాద్, నవంబర్ 6 : ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల సోమవారం 7న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి తమ దరఖాస్తులను అందించేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి ఇబ్బంది పడకూడదని కలెక్టర్ తెలిపారు.
రామన్నా.. మీ కృషి ఫలించింది..
ఆదివారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను కలిసిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘రామన్నా.. మీ కృషి ఫలించింది.. మునుగోడులో మనం గెలిచాం’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.