వికారాబాద్, నవంబర్ 2 : పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకే టీడీ వ్యాక్సినేషన్ చేయనున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో టీడీ వ్యాక్సినేషన్ జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలకు ధనుర్వాతం రాకుండా ఉండేందుకు టీడీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 7 నుంచి 19 వరకు నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలవారీగా సూక్ష్మ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. 10-16 సంవత్సరాలు గల బాలబాలికల వివరాలను గ్రామాలవారీగా సిద్ధం చేసుకొని బడిలో ఉన్న, బడి బయట ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో నవంబర్ 7, 8 తేదీల్లో గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల్లో.. 9, 10, 11 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రణాళికబద్దంగా పెద్దమొత్తంలో వ్యాక్సినేషన్ చేపట్టాలన్నారు. వ్యాక్సినేషన్పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. గ్రామాలు, వార్డుల్లో వ్యాక్సినేషన్ చేసిన వివరాలను ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు రోజూ అందించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. అత్యవసర సమయాల్లో సంప్రదించేందుకు ఫోన్లలో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
ధూమపానం చేసేవారిపై చర్యలు
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడంవల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్ తెలిపారు. బుధవారం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పొగాకు నియంత్రణ సెల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో సంచరించే బస్స్టాండ్, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్లు, దవాఖానలు, విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు తీసుకోవడం వల్లే జరిగే నష్టాలు, ప్రమాదాలపై అవగాహన కల్పించే బోర్డులు, గోడప్రతులను ప్రదర్శించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. అనంతరం కోప్టా సెక్షన్స్కు సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశాల్లో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పల్వాన్కుమార్, విద్యాధికారి రేణుకాదేవి, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, అడిషనల్ ఎస్పీ రషీద్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర ఉన్నారు.
సాయం అందించడం స్ఫూర్తిదాయకం
భారీ వర్షాల కారణంగా ఇల్లు దెబ్బతిన్నవారికి తక్షణ సాయం అందించడం, బాధితులకు అండగా ఉండటం రెడ్ క్రాస్ సొసైటీ సేవలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు దెబ్బతిన్న నిస్సహాయులకు టార్పలిన్, వంట పాత్రలు, ఆరోగ్య సామగ్రి కిట్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా నిలిచి, విపత్తు సమయాల్లో విశిష్ట సేవలందిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయమన్నారు. విపత్తు సమయాల్లో ప్రతిఒక్కరూ బాధితులకు అండగా ఉండాలని, సామాజిక సేవలో ముందుకు రావాలని కోరారు. కిట్ల పంపిణీలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్వన్ కుమార్, అడిషనల్ ఎస్పీ రషీద్, డీపీవో మల్లారెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా గౌరవ కార్యదర్శి సాయిచౌదరి, జిల్లా కోశాధికారి డాక్టర్ సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.