సిటీబ్యూరో, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ చొరవతో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మన్నెగూడలో బుధవారం వేర్వేరుగా నిర్వహించిన గొల్లకురుమల, ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులవృత్తులకు జీవం పోసి వారి ఆర్థిక పరిపుష్టిని పెంచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కటి కాదు రెండు కాదు 11వేల కోట్ల రూపాయలతో రెండు విడుతలుగా గొర్రెల పంపిణీ చేసుకున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఏకైక ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఒక్కరే.. అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాక ముందు గొర్రెల పెంపకందారుల సొసైటీలు 2 లక్షల 21 వేలు ఉండగా, ప్రస్తుతం 7 లక్షల 61 వేలకు పెరిగాయన్నారు. ప్రతి సంవత్సరం రూ.110 కోట్లు ఖర్చు పెడుతూ 28కోట్ల పైచిలుకు చేపపిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 46వేల చెరువుల్లో వేస్తూ ముదిరాజ్ల అభ్యున్నతికి చేస్తున్న కృషిని ఇతర రాష్ర్టాల వారు ప్రశంసిస్తున్నారన్నారు. అనంతరం రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ గొర్రెల పథకానికి ప్రతిపక్ష నాయకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయన్నారు. గొల్ల కురుమల కోసం నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనాలు పూర్తి దశకు వచ్చాయన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గొల్ల కురమల ఆత్మగౌరవాన్ని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని, సదరన్ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
అక్కడ ప్రశంసలు.. ఇక్కడ విమర్శలా..?
తెలంగాణ రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ మంత్రులు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకం, 1962 అంబులెన్స్ పథకాలను చూసి కేంద్ర మంత్రులు పర్షోత్తమ్ రూపాల, గిరిరాజ్ సింఘ్, కర్ణాటక రాష్ట్ర ఫిషరీస్, షిప్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పండిత్రావులు ప్రశంసించారని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పథకాలు నంబర్ వన్ అని, ఇలాంటి పథకాలు బీజేపీ ప్రభుత్వంలో లేవని మంత్రులు అన్నారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చేసిన పనిని ఎవరైనా సరే గుర్తించక తప్పని పరిస్థితి ఉంటదని చెప్పేందుకు ఇదే తార్కాణమని తెలిపారు. గొర్ల కురమల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవని చెప్పారు. టాటాలు మాత్రమే కాదు మన తాతల నాటి కులవృత్తులు కూడా బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనేది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచనకనుగుణంగానే పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలబడి ఆశీర్వదించాలని గొర్ల కురుమలను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్య యాదవ్, నల్లగొండ డీసీఎంఎస్ చైర్మన్ జానయ్య యాదవ్, ఖమ్మం డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, ఎంపీపీ స్వామి యాదవ్, పాల్గొన్నారు.
రెండు, మూడు నెలల్లో ఆత్మగౌరవ భవనాలు ప్రారంభం : మంత్రి హరీశ్రావు
గొర్రెల పంపిణీ పథకానికి ప్రతిపక్ష నాయకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయని, కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంత్రి రేవణ్ణ కూడా ఈ పథకాన్ని పొగిడి సీఎం కేసీఆర్ను సన్మానిస్తే కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసిందని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గుర్తు చేశారు. గొల్ల కురుమల కోసం హైదారాబాద్లోని గండి చెరువు వద్ద వేర్వేరుగా నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనాలు పూర్తి దశకు వచ్చాయని రెండు, మూడు నెలల్లో ప్రారంభోత్సవాలు చేస్తామని తెలిపారు.
అమ్ముడుపోయిన రాజగోపాల్కు బుద్ధిచెప్పాలి
ప్రజా శ్రేయస్సు అవసరం లేని బీజేపీ నాయకులు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్తోనే తమ పోటీ అని చెప్పుకోవడం హాస్యాస్పదం. 18వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయిన వ్యక్తికి ప్రజలు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయం. రాష్ట్రంలోని గొల్ల, కురుమలను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గొల్ల, కురుమలు ఉంటారు. బలహీన వర్గాలను రాజ్యసభకు పంపిన ఘనత దేశంలో సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
–బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ రాజ్యసభ
గొల్ల, కురుమల అభ్యున్నతిని ఓర్వని బీజేపీ
గొల్ల, కురుమల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా ప్రభుత్వం నగదును బదిలీ చేస్తే గొల్ల, కురుమల అభ్యున్నతిని ఓర్వలేని బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారు. ఇది బీజేపీ ప్రభుత్వ దాష్టికానికి నిదర్శనం. తెలంగాణలో మాదిరిగా దేశ వ్యాప్తంగా గొర్ల పంపిణీ జరగాలంటే దేశానికి సీఎం కేసీఆర్ నేతృత్వం అవసరం ఉంది.
–నోముల భగత్, ఎమ్మెల్యే నాగార్జున సాగర్
నవంబర్ 6 తర్వాత గొర్రెల పంపిణీ మంత్రి తలసాని
గత ప్రభుత్వాలు గొల్ల కురమల బాగోగులను ఏనాడూ పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని పెంచేలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గం గొల్ల కురుమలు ఆందోళన చెందవద్దని నవంబర్ 6న ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునుంచే గొర్రెల పంపిణీని మొదలుపెడుతామని తెలిపారు.
ఢిల్లీ నుంచి గుజరాత్ గద్దల రాజకీయం
దేశ ప్రజల శ్రేయస్సుతో పనిలేకుండా గుజరాత్ గద్దలు ఢిల్లీ నుంచి రాజకీయం చేస్తున్నారు. అదానీ, అంబానీల బాగుకోసం మాత్రమే పనిచేసే బీజేపీ ప్రభుత్వానికి కార్మిక, కర్షక వర్గాలు కలిపించడం లేదు. దేశంలో ఎక్కడాలేని విధంగా గొల్ల, కురుమలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న చరిత్ర సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
– రాజారాం యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు
గొల్ల, కురుమలకు ఆర్థిక చేయూత
రాష్ట్రంలో గొల్ల, కురుమల కష్టాలను ఎరిగి వారిని గుర్తించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్. గొల్ల, కురుమలకు ఆర్థిక చేయూతను అందించడమేగాకుండా, రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా గొల్ల, కురుమలు ఉంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్లను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది.
– కొత్తకుర్మ సత్తయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా