రంగారెడ్డి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇప్పటికే టాటా ఏస్, ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై అందజేయడంతో పాటు చేపల వేటకు సంబంధించిన సామగ్రిని సైతం అందజేసింది. చేప పిల్లలను సైతం ప్రతి ఏటా ఉచితంగా అందజేస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురువడంతో ఎన్నో ఏండ్లుగా నిండని చెరువులు సైతం అలుగుపారాయి. ఏటేటా మత్స్య సంపద పెరుగుతుండడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 800 చెరువులు ఉండగా, దాదాపుగా అన్నీ నిండడంతో జలకళతో ఉట్టిపడుతున్నాయి. ‘మిషన్ కాకతీయ’తో చెరువుల పునరుద్ధరణ జరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరుగడంతో ఈ ఏడాది కోటీ 60 లక్షల చేపపిల్లలను అందించాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో ఇప్పటికే సగానికిపైగా చెరువుల్లో 60 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. మిగిలిన చెరువుల్లో నెల రోజుల్లోపు చేప పిల్లలను వేయనున్నట్లు మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. చేప పిల్లల పంపిణీ, మత్స్య సంపద పెంపులో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా టాప్ – 3లో ఉండడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులతో పాటు వివిధ రంగాలను వృద్ధిలోకి తెస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వ్యవసాయానికి, దాని అనుబంధ రంగాలకు జీవం పోస్తున్నది. ఇటీవల వర్షాలు అధికంగా కురవడంతో జలాశయాలు, కుంటలు, చెరువులు, బావులు, నిండు కుండల్లా మారాయి. తాగునీటికి, సాగునీటికి కొరత లేకపోవడంతో వ్యవసాయం పండుగగా మారింది. వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య సంపదకు ప్రాధాన్యం ఇస్తున్నది. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో 800 చెరువులు/కుంటల్లో నీలి విప్లవం అభివృద్ధికి కృషి చేస్తున్నది. సర్కారు ఉచితంగా చేప పిల్లలను అందిస్తుండటంతో మత్స్య సంపదను పెంచేందుకు అడుగులు పడుతూనే ఉన్నాయి.
నిండుగా జలాశయాలు..
జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని జలాశయాలన్నీ నిండుగా కళకళలాడుతున్నాయి. గత ఆరేండ్లుగా నీలి విప్లవం దిశగా ప్రభుత్వం అడుగులు కదుపుతూ, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఒట్టిపోయిన, పడావు బడ్డ చెరువులు, కుంటలను ‘మిషన్ కాకతీయ’ కింద పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపట్టేందుకు కృషి చేస్తున్నది. చేప పిల్లల పంపిణీలోనూ, దిగుబడిలోనూ రంగారెడ్డి జిల్లా టాప్-3లోనే ఉంటున్నదని జిల్లా అధికారులు చెబుతున్నారు.
చేప పిల్లల పంపిణీ 50శాతం పూర్తి..
ఇప్పటికే జిల్లాలోని ఎన్నో చెరువులు, కుంటలు, పలు జలాశయాల్లో చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 800 చెరువులు ఉండగా, వాటిలో 1,60,00,000 చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటికే 50శాతం పంపిణీ పూర్తైంది. 400 చిన్న, పెద్ద చెరువుల్లో 60 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. పంపిణీ, దిగుబడిలో గానీ రాష్ట్రంలో రంగారెడ్డి టాప్-3గా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం చిన్న సైజు, పెద్ద సైజు చేప పిల్లలకు ఒక్కో సంవత్సరానికి లక్షల్లో ఖర్చు చేస్తున్నది. ప్రతి ఏడాది చేప పిల్లల వ్యయం లక్షల్లో ఉంటే, దిగుబడి అంతకు మించి ఉంటున్నదని, ఆదాయం కోట్లల్లో ఉంటున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
మరో కోటి చేప పిల్లలను అందిస్తాం
ఇప్పటికే చేప పిల్లల పంపిణీని 50శాతం పూర్తి చేశాం. జిల్లాలో మొత్తం 800 చెరువులకు గాను వివిధ రకాల చేపల్లో చిన్న, పెద్ద తరహా పిల్లలు 1,60,00,000 చేప పిల్లలు కావాల్సి ఉంది. అయితే, 60 లక్షల చేప పిల్లలను ఆయా చెరువులు, కుంటల్లో పోశాం. ఇంకా సగం వరకు కార్యాచరణ జరుగాల్సి ఉంది. మరో కోటి చేప పిల్లలను మిగిలిన చెరువులకు అందించాలి. మరో 30 రోజుల్లో ఈ పంపిణీని పూర్తి చేస్తాం. చేపల పెంపకంలో దిగుబడి, రాబడి అధికంగా ఉన్నది.
– అత్యల సుకీర్తి,జిల్లా మత్స్య శాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా