షాబాద్, అక్టోబర్ 17 : జిల్లాలోనే అతి పెద్ద సంతగా పేరొందిన సర్దార్నగర్ మార్కెట్ కమిటీకి మహర్దశ కలిగింది. ప్రతి మంగళవారం నిర్వహించే పశువుల సంత మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుండడంతో మార్కెట్కు మంచి ఆదాయం సమకూరుతున్నది. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాతోపాటు మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రైతులు, వ్యాపారులు ఇక్కడికి వచ్చి పశువుల క్రయ, విక్రయాలు చేపడుతుంటారు. గతంలో టెండర్ల పద్ధతిలో ప్రభుత్వం పశువుల సంతను నిర్వహించేది. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశంతో గత ఏడాదిన్నర నుంచి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువుల సంత నిర్వహిస్తున్నది. దీంతో వారానికి రూ.1.50లక్షల చొప్పున నెలకు రూ.6లక్షల వరకు మార్కెట్ కమిటీ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ డబ్బులతో మార్కెట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
షాబాద్ మండలంలోని సర్దార్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి మంచి ఆదాయం వస్తున్నది. ప్రతి మంగళవారం ఈ మార్కెట్లో పశువుల సంత జరుగుతుంది. పశువుల క్రయ విక్రయాలకు సంబంధించి రైతులు, వ్యాపారుల నుంచి 1 శాతం మార్కెట్ కమిటీకి చెల్లిస్తున్నారు. వారి నుంచి తీసుకున్న డబ్బులకు ఆన్లైన్ పద్ధతిలో రశీదులు అందజేస్తున్నారు. ఈ మార్కెట్ పరిధిలోకి షాబాద్, మొయినాబాద్ మండలాలు వస్తాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ కమిటీకి రూ.56.58లక్షల ఆదాయం సమకూరగా.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ నెల వరకు రూ.41.45లక్షలు ఆదాయం వచ్చినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.1.50కోట్ల చొప్పున సర్దార్నగర్లో ఒకటి, మొయినాబాద్లో రెండు చొప్పున 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ధాన్యం నిల్వ గోదాముల నిర్మాణం చేపట్టింది. గత ఏడాదిన్నరగా పశువుల సంత నిర్వహణతో మార్కెట్కు వస్తున్న ఆదాయంతో దుకాణ సముదాయాలు, కార్యాలయ నూతన భవన నిర్మాణం, గొర్రెలు, మేకల మార్కెట్ ఏర్పాటుతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పశువుల సంతలో రైతులు, పశువులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్దార్నగర్ మార్కెట్ కమిటీకి మహర్దశ కలిగింది. గతంలో పశువుల సంత టెండర్ల పద్ధతిలో నిర్వహించేవా రు. ప్రభుత్వ ఆదేశాలతో గత ఏడాదిన్నరగా మార్కె ట్ కమిటీ ఆధ్వర్యంలో పశువుల సంత నిర్వహిస్తు న్నాం. ప్రతి మంగళవారం జరుగుతున్న సంతలో రూ.1.50లక్షల వరకు ఆదాయం వస్తుంది. నెలకు రూ.6లక్షల వరకు మార్కెట్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతాం. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాద య్య, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి సహకారంతో సర్దార్నగర్ మార్కెట్ను జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాం.
– స్వప్న, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, సర్దార్నగర్
ప్రతి మంగళవారం జరిగే పశువుల సంతలో రైతు లు, వ్యాపారుల నుంచి 1 శాతం డబ్బులు వసూలు చేసి.. ఆన్లైన్ పద్ధతిలో రశీదులు అందజేస్తున్నాం. దీంతో ఎలాంటి అవకతవకలకు తావులేదు. సంతలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం
– శ్రీనివాస్, మార్కెట్ కమిటీ కార్యదర్శి