పత్తి సాగుకు ప్రకృతి అనుకూలించింది. సమృద్ధిగా వర్షాలు పడడంతో పత్తి పొలాలు ఏపుగా పెరిగాయి. మొక్కజొన్న, వరిసాగు తగ్గడంతో ఆ విస్తీర్ణం మొత్తం పత్తి ఆక్రమించినట్లు సమాచారం. జిల్లాలో 2లక్షల 42వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో మూడేండ్లుగా రైతులు ఎక్కువగా పత్తి పంటను సాగు చేయడంతో పంటలో గులాబీ పురుగు ప్రభావంతో నష్టాలు ఎదుర్కోవల్సి వస్తున్నది. రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు గులాబీ పురుగు నివారణ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పింక్బౌల్ నివారణకు ముందస్తు చర్యలు, జాగ్రతలు తీసుకుంటే ఎలాంటి నష్టం వాటిల్లదని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
తాండూరు, అక్టోబర్ 9
పత్తికి ప్రభుత్వ మద్ధతు ధర రూ.6200కు పైగా కల్పించడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. ప్రారంభ దశలో కురిసిన వర్షానికి కొంతమేర పంటకు నష్టం జరిగినప్పటికీ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా పత్తి పైరులు ఏపుగా పెరుగుతున్నట్లు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగు విస్తీర్ణంతోపాటు పైరులకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో నెలపాటు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తే మంచి దిగుబడులు చేతికందుతాయని రైతులు సంబురపడుతున్నారు.
వాతావరణ పరిస్థితులను ముందే అంచనా వేసిన జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించింది. దీంతో రైతులు మొక్కజొన్న, వరి స్థానంలో పత్తి సాగు ప్రారంభించారు. రైతులకు పత్తి విత్తనాలు, మందులు కూడా అందుబాటులో ఉంచారు. పత్తిని నాశనం చేసే పురుగులపై కూడా జిల్లా వ్యవసాయ శాఖ సూచనలు చేయడంతో రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సకాలంలో పంటకు మందులు పిచికారీ చేస్తున్నారు.
జిల్లాలో పంటపొలాల్లో జోరుగా పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పత్తి పొలాల్లో కలుపు తీసినప్పటికీ ఇటీవల కురిసిన వర్షంతో అక్కడక్కడ గడ్డి మొలవడంతో మూడో దఫాగా రైతులు పత్తి పొలాల్లో కలుపు తీస్తున్నారు. కాస్త ముందుగా వేసిన పత్తి రేగడి పొలాల్లో ఏపుగా పెరగడంతోపాటు పువ్వు, కాయదశలోకి వచ్చింది. దీంతో పత్తిని పురుగులు నాశనం చేయకుండా రైతులు క్రిమిసంహార మందులు పిచికారీ చేస్తున్నారు. చిన్నగా ఉన్న పైరుల్లో పత్తి ఎదుగుదలకు డీఏపీ, యూరియా, పొటాష్తో పాటు పలు రకాల ఎరువులను పత్తి మొక్కలకు వేస్తున్నారు.
పంట సాగుకు వర్షం అనుకూలించడంతో పత్తి మొక్కలు బాగా పెరుగుతున్నాయి. పంట దిగుబడులు తగ్గకుండా అధికారుల సూచనలతో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో రెండు సంవత్సరాలుగా గులాబీ పురుగు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఫలితంగా రైతులు వివిధ ధశల్లో పంటను నష్టపోవాల్సి వస్తున్నది. పత్తి పంటపై పింక్బౌల్ ఆశించకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సరైన అవగాహనతోనే పంటలు మంచిగా పండించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ప్రమాదకరమైన తల్లి పురుగు పంటలోని ఆకుల కింద, లేత కొమ్మలపైన, పూల మొగ్గపై, లేత కాయలపై గుడ్లు పెడుతుంది. ఈ పురుగు జీవిత కాలం 45 రోజులుండగా.. గుడ్ల నుంచి పొదగబడిన పిల్ల పురుగులు పూల మొగ్గల్లోకి తొలుచుకుపోయి లోపలి పదార్థాలను తిని గుడ్డిపూలుగా మిగులుస్తాయి. చిన్న లార్వాలు కాయలకు కనిపించనంత రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశిస్తాయి. దీంతో పురుగు లోపలి గింజను తింటూ దూదిని, పంటను నష్టపరుస్తాయి. అందుకు రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
గత ఏడాది కంటే ఈసారి పత్తి పంట చాలా బాగుంది. ప్రారంభంలో కాస్త భయమైనప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో వ్యవసాయ శాస్తవేత్తలు, అధికారుల సూచనల ప్రకారం మందులు పిచికారీ చేస్తున్నాం. ప్రభుత్వం పత్తికి రూ.6200 మద్దతు ధర కల్పించడం సంతోషం.
జిల్లాలో మూడు సంవత్సరాలుగా పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో కన్నా ఎక్కువగా రైతులు పత్తి సాగుపై శ్రద్ధ చూపుతున్నారు. రైతుల ఆసక్తికి తగ్గట్లు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పత్తిని నాశనం చేసే గులాబీ పురుగు నివారణపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. పంట మొలకెత్తుతున్న దశలో అధిక వర్షాలతో కొంత నష్టం జరిగినా.. తదుపరి వేసిన పంటలు చాలా బాగున్నాయి. వాతావరణం అనుకూలిస్తే పంట దిగుబడులు బాగుంటాయి. పత్తి సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే వ్యవసాయ శాఖను సంప్రదిస్తే తగు సహాయం అందిస్తాం.
– గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి