ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 9 : ఇబ్రహీంపట్నం పెద్దచెరువును త్వరలోనే పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం కట్ట మైసమ్మ వద్ద నియోజకవర్గ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. రెండోరోజు ఆదివారం కావటంతో చెరువుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఉప్పరిగూడగేటు సమీపంలోని అలుగు వద్దకు చేరుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సుదీర్ఘకాలం తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండటం సంతోషంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించటంతో పాటు కట్టమైసమ్మ దీవెనలు కూడా ఉండటంతో చెరువు నిండిందన్నారు. అనంతరం కట్టమైసమ్మ ఆలయం వద్ద ఆయనతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు కలిసి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు, రైతులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చెరువు వద్ద పూజలు నిర్వహించారు.
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలుగు సమీపంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ విగ్రహం వద్ద 1008 కొబ్బరికాయలు కొట్టి గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, ఎంపీపీ కృపేశ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్ అల్వాల జ్యోతి, నాయకులు వెంకట్రెడ్డి, మొద్దు అంజిరెడ్డి, మోహన్రెడ్డి, రాములు, రమేశ్, గణేశ్ పాల్గొన్నారు.