తెలంగాణ చరిత్రలోనే ఒక నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్కు ఉమ్మడి జిల్లా జనం జైకొడుతున్నారు. యావత్ భారతజాతి ఆశలకు, ఆకాంక్షలకు, వెన్నుదన్నుగా నిలిచేందుకు బీఆర్ఎస్ను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ పార్టీ ఆవిర్భవించి ఎన్నో పోరాటాలు, విజయాల అనంతరం టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందడంతో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాల్చుతూ, ప్రజలకు స్వీట్లు పంచుతూ పండుగ చేసుకున్నారు. వాడవాడలా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పలుచోట్ల పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ దేశ్కీ నేత కేసీఆర్, జై బీఆర్ఎస్, జయహో కేసీఆర్ వంటి నినాదాలు చేయడంతో ఉమ్మడి జిల్లా మార్మోగింది. సరైన సమయంలో గొప్ప ముందడుగు వేశారని కేసీఆర్ నిర్ణయాన్ని రాజకీయ విశ్లేషకులు, మేధావులు స్వాగతిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.
అభివృద్ధి, పురోగతియే ధ్యేయంగా దేశరాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నవశకం ప్రారంభించింది. జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్పు చెందింది. ఈ చారిత్రక ఘటనకు విజయ దశమి నాడు తెలంగాణ భవన్ వేదికైంది. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు హాజరయ్యారు. జాతీయ పార్టీగా మార్చుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంబురాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యమాలిక మీకోసం.