తెలంగాణ సాధన కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా ఎదిగి నేడు జాతీయ పార్టీగా అవతరించడం చారిత్రాత్మకం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. తెలంగాణ పథకాలు దేశ ప్రజలకు అందజేసి, మేలు చేకూర్చాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ను స్థాపించిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణిస్తారని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
ఉద్యమ పార్టీని ముందుండి నడిపిన గులాబీ పార్టీ కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితిని తమ భుజ స్కందాలపై మోసే గులాబీ సైన్యానికి హార్థిక శుభాకాంక్షలు. విజయ దశమి పర్వదినాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్పు చెందడం దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక నిర్ణయం. 14 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక రాష్ట్ర సాధనలో రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజల దీవెనలతో తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచడంలోనూ నిర్విరామంగా పని చేసింది. కేంద్ర ప్రభుత్వ దుందుడుకు విధానాలపై, కక్షపూరిత వ్యవహారంపై విసిగివేసారిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించి టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా మార్చడం ఆనందదాయకం.
– డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్’ భారతదేశంలో అమలవుతున్న పథకాల కంటే చాలా గొప్పగా ఉన్నాయి. ఈ పథకాలు దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో అమలు కావడం లేదు. ప్రధానంగా మన దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, దాని పాలిత రాష్ర్టాల్లో కూడా ఇటువంటి పథకాలు లేవు. దేశ జనాభాలో వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అమలు చేస్తున్న రైతుబంధు పథకం కింద ఒక ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు, ఒక గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే, రైతు బీమాగా రూ.5 లక్షలు వారంలోపల ప్రభుత్వం అందజేస్తున్నది. ఇలాంటి పథకాలు మన చుట్టు పక్కల రాష్ర్టాల్లో ఎక్కడా లేవు. పలు రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమ రాష్ట్రంలోనూ అందుబాటులోకి తేవాలని, లేదా తమ ప్రాంతాలను తెలంగాణలో కలుపాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా జాతీయ స్థాయిలో రైతు సంఘాలు, ఇతర సంఘాలు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆహ్వానిస్తున్నాయి. తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని కోరుకుంటున్నాయి. పారిశ్రామిక రంగంలో టీఎస్ ఐ పాస్ ద్వారా రెండు లక్షల కోట్ల వరకు తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయి. కేవలం ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. కాబట్టి దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నది. అందుకే ముందు చూపుతో తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజకీయాల వైపు పయనించడం సరియైన సమయం.
– తీగల అనితా హరినాథ్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్, రంగారెడ్డి జిల్లా
దేశవ్యాప్త ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ దేశంలో సునామీ సృష్టించనున్నది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి అతితక్కువ సమయంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనుంచి దేశ రాజకీయాల్లో ప్రశంసలు అందుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టీని దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రత్యామ్నాయ పార్టీ ఎంతో అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. రాష్ట్రంలో మాదిరిగా దేశంలో కూడా బీఆర్ఎస్ను బలమైన శక్తిగా తయారు చేయడానికి మేమంతా కృషి చేస్తాం. రాష్ట్రంలో కొనసాగుతున్న దళితబంధు, గిరిజనబంధు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముభారక్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు జరుగాల్సిన అవసరం ఉన్నది. ఈ పథకాలన్నింటిని దేశప్రజలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారు. అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి కేసీఆర్తో వివిధ రాష్ర్టాల్లోని నేతలు జతకట్టనున్నారు.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో ఎంతో అభివృద్ధి జరిగింది. రాష్ట్ర తలసరి ఆదాయం రెండింతలు పెరిగింది. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో అమలవుతాయన్న నమ్మకంతో దేశ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తారు. ఎన్నో రాష్ర్టాలు బీఆర్ఎస్తో కలిసి ముందుకు సాగనున్నాయి. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో… అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీముబాదర్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలు దేశవ్యాప్తం కానున్నాయి. దశాబ్దాలుగా వెనుకబడిన భారతదేశం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వచ్చిన సందర్భంగా దేశ ప్రజలు హర్షిస్తున్నారు.
– డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే
బీ(టీ)ఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లో పెను మార్పునకు నాంది ఏర్పడింది. గడచిన 8 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధితో దేశం చూపు తెలంగాణ వైపు మళ్లింది. దేశరాజకీయాల్లో సీఎం కేసీఆర్ అడుగు పెట్టడం సంతోషకరం. కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రజలకు నమ్మకం ఏర్పడింది. దేశ రాజకీయాల్లో సమూల మార్పులు రానున్నాయి. భారత రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించడంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తరహాలో బీ(టీ)ఆర్ఎస్ పార్టీ దేశంలో విజయం సాధించనున్నది. పార్టీ ఆవిర్భావంపై ముఖ్యమంత్రికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యే, కొడంగల్
జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్నారు. బీ(టీ)ఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటుతో దేశ ప్రజలకు మేలు జరుగనున్నది. దేశంలోని అన్ని వనరులు, వాటి వినియోగం, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్కు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. టీఆర్ఎస్ ఏర్పాటు చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించనున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేసీఆర్ కృషి చేయనున్నారు. ఇప్పటికే అనేక రాష్ర్టాల నుంచి బీ(టీ)ఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు.
– కొప్పుల మహేశ్రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యం కానున్నది. ప్రత్యేక తెలంగాణే లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 ఏండ్లు సుధీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. స్వరాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడంతో జాతీయ స్థాయిలో అన్ని వర్గాల నుంచి, ఆయా పార్టీల నుంచి మంచి మద్దతు లభిస్తున్నది. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ రూపురేఖలు మార్చేందుకు దసరా పండుగ రోజున జాతీయ పార్టీ ప్రకటించడం గొప్ప పరిణామం. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మాదిరిగా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయం.
– కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే