ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 5 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం విజయదశమిని ఘనంగా జరుపుకొన్నారు. వ్యాపారులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. వాహనాలకు పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రతి గ్రామంలో దసరా సందర్భంగా జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి జమ్మిని పంచుకుని అలయ్..బలయ్ తీసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల పరిధిలోని గ్రామాల్లో పెద్ద ఎత్తున దసరాను ఘనంగా జరుపుకొన్నారు.
షాబాద్ : విజయదశమి వేడుకలను షాబాద్ మండలంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరూ కొత్త బట్టలు ధరించి స్థానికంగా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు జరిపిన భక్తులు తెలంగాణ ప్రాంతంలో బంగారమని పిలుచుకునే శమీపత్రాలు(జమ్మిఆకులు)ఒకరికొకరు ఇచ్చుకుని దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కడ్తాల్ : మండల వ్యాప్తంగా విజయదశమని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి, పెద్దమ్మతల్లి గ్రామ ప్రధాన పురోహితుడు వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి వారిని గరుడ వాహనంపై ప్రధానవీధులగుండా భారీ ఊరేగింపుతో భక్తి పాటలు ఆలపిస్తూ, హన్మాన్ఘడ్ వద్ద ఏర్పాటు చేసిన జమ్మిచెట్టు వరకు ఊరేగించారు.