చేవెళ్ల రూరల్, అక్టోబర్ 4 : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో మన ఊరు-మన బడి కార్యక్రమంతో రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తూ విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.కోటి సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన 4 తరగతి గదుల ప్రారంభం, సుమారు రూ.5 కోట్లతో ఎన్సీసీ సంస్థ సహకారంతో గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు.
విద్యావ్యవస్థకు పెద్దపీట
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంద్రన్న పుట్టి పెరిగిన గ్రామంలో జయంతి రోజున పాఠశాల భవనం, తరగతి గదులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థకు పెద్దపీట వేస్తున్నారన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.7వేల కోట్ల నిధులు వెచ్చించి పాఠశాలల రూపురేఖలు మార్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వెయ్యికి పైగా గురుకులాలను నెలకొల్పి.. అన్నింటినీ ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేసినట్లు మంత్రి తెలిపారు.
గురుకులాల వలె ప్రభుత్వ పాఠశాలలు
గురుకులాలకు బాగా డిమాండ్ ఏర్పడిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ బడులు అన్నింట్లో గురుకులాల వలె తీర్చిదిద్దడానికి ఆదేశించారన్నారు. కౌకుంట్ల గ్రామంలో పాఠశాల అభివృద్ధిలో భాగంగా నిధులు అందించిన అరబిందో ఫార్మా కంపెనీ వారిని మంత్రి అభినందించారు. రూ.5కోట్లతో రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన ఎన్సీసీ సంస్థ వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య నిధుల నుంచి రూ.50లక్షలతో గ్రామంలో మ్యారేజ్ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అరబిందో ఫార్మా ప్రతినిధి సదానందరెడ్డిని మంత్రి సన్మానించారు.
ఇంద్రన్న సేవలు మరువలేనివి
తరాలు మారినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఘనత మాజీ మంత్రి, స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డికే దక్కుతుందని.. ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇంద్రారెడ్డి జయంతిని పురస్కరించుకొని కౌకుంట్లలోని ఆయన సమాధి వద్ద, చిట్టంపల్లిగేట్, ఖానాపూర్ చౌరస్తాలోని ఇంద్రారెడ్డి విగ్రహాలకు మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయం కెరటంగా.. చేవెళ్ల ప్రజల ముద్దు బిడ్డగా.. తెలంగాణ టైగర్గా తుది శ్వాస వరకు ప్రత్యేక రాష్ట్ర సాధనకు పరితపించిన ఇంద్రన్న ప్రజల మనసులో ఎప్పటికీ అమరులేనన్నారు.
కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి కుమారులు కార్తీక్రెడ్డి, కౌశిక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, మనుమరాలు అక్షయిని, మనుమడు ఇంద్ర, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, కంపెనీ ప్రతినిధి సదానందరెడ్డి, ఆర్జేడీ విజయలక్మి, డీఈవో సుశీందర్రావు, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరంగారెడ్డి, కౌకుంట్ల సర్పంచ్ గాయత్రి, అంతారం సర్పంచ్ సులోచన, కౌకుంట్ల ఉపసర్పంచ్ ఇనాయత్, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇంద్రారెడ్డికి ఘన నివాళి
చేవెళ్లటౌన్ : తెలంగాణలాంటి పాలన దేశమంతా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా చేవెళ్లలో ఇంద్రారెడ్డి చౌరస్తాలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే యాదయ్య, తన కుమారులతో కలిసి సబితారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు కృషి చేసి.. ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. ఆయన ప్రతి నిత్యం ప్రజల మధ్య ఉంటూ పేదల అభివృద్ధికి కృషి చేశారన్నారు. చేవెళ్ల ప్రాంత ప్రజల గుండెల్లో ఇంద్రారెడ్డి కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు.
కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్న దేశ ప్రజలు
దేశంలోని రైతులు తెలంగాణ వలె 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా కోరుకుంటున్నారని తెలిపారు. అడబిడ్డల పెండ్లిళ్లకు ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్తోపాటు వివిధ రకాల పింఛన్లు దేశమంతా ఇవ్వాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి హన్మంత్రెడ్డి, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, మాజీ ఎంపీపీ బాల్రాజ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, సర్పంచ్లు, చేవెళ్ల మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, నాయకులు కృష్ణారెడ్డి, రమణారెడ్డి, నర్సింహులు, మహేందర్రెడ్డి ఉన్నారు.