న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ;పల్లెలు, వాడలు పూల వనాలయ్యాయి.. ‘చిత్తూ చిత్తూల బొమ్మ.. శివుడి ముద్దుల గుమ్మ..’ ‘కొమ్మా పూసే కోల్.. సుక్కా పొద్దుకే కోల్’ అని పాడుతూ ఆడబిడ్డలు సందడి చేశారు.. ‘మమ్మల్ని దీవించమ్మా..’ అంటూ గౌరమ్మను కొలిచారు.. కుంటలు, చెరువుల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసి నువ్వులు, నూకలు, బెల్లం ప్రసాదాలను ఒకరికొకరు పంచుకున్నారు. చివరిరోజు సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. వికారాబాద్లో జరిగిన సంబురాల్లో మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ నిఖిల పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూల వనాలన్నీ ఒక్కచోట చేరినట్లుగా పల్లెల ప్రధాన కూడళ్లు పరవశించాయి. ఆలయాల వద్ద, గ్రామాల కూడళ్ల వద్ద, కాలనీలన్నీ పూదోటలు కాగా, లయబద్దంగా చప్పట్లు, కోలాటాలు వేస్తూ సాగిన పల్లె పాటలు, డీజే పాటలు ఉత్తేజాన్ని నింపాయి. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారిని స్తుతిస్తూ పురాణ గాథలు, చరిత్రలను కండ్లకు కట్టినట్లుగా పాడి అలరింపజేశారు. చిన్నాపెద్దా పటాకులు కాల్చుతూ ఆనందంగా గడిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం సంబురాల్లో పాల్గొని సందడి చేశారు. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.