-విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
వికారాబాద్ అక్టోబర్ 3 : రాష్టంలో మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్ అవరణలో ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డితో కలిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 8 సంవత్సరాలుగా గ్రామగ్రామాన బతుకమ్మ పండుగను నిర్వహించుకునేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బతుకమ్మ పండుగకు రూ.300 కోట్లు ఖర్చు చేసి బతుకమ్మ చీరలను మహిళలకు అందిస్తున్నారని తెలిపారు. సిరిసిల్లా జిల్లాలోని నేతన్నలకు బతుకమ్మ చీరలతో ఉపాధి కల్పించారని సీఎం కేసీఆర్ను కొనియాడారు.
బతుకమ్మతో పర్యావరణానికి మేలు
జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు గుర్తింపు తెచ్చింది సీఎం కేసీఆర్ అని తెలిపారు. బతుకమ్మ పర్యావరణానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు అందిస్తూ కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్ నిలిచారని ఆమె తెలిపారు. ప్రభుత్వం తరఫున నిర్వహించే బతుకమ్మ పండుగకు మహిళలు పెద్దఎత్తున రావడం హర్షణీయమన్నారు.
అధికారికంగా బతుకమ్మ పండుగ
కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా నిర్వహించే ఈ పండుగను అన్ని శాఖల అధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఈ పండుగ కొంతమందే జరుపుకొనేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మహిళలందరూ అధికారికంగా జరుపుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు.
అన్ని పండుగలకు ప్రాధాన్యం
ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యం కల్పిస్తున్నదని తెలిపారు. తొమ్మిది రోజులపాటు మహిళలు ఆటపాటలతో బతుకమ్మ పండును ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళలతో బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పోటీలను నిర్వహించి గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు నూతనంగా మంజూరైన పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీ చంద్రకళ, జిల్లా అధికారులు లలితాకుమారి, కోటాజీ, మల్లేశం, విజయకుమారి, హన్మంత్రావు, రేణుకాదేవి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, కృష్ణన్, గోపాల్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్ షర్మిల, ఎంపీడీవో సత్యయ్య పాల్గొన్నారు.