రంగారెడ్డి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : పెద్దల త్యాగాలతోనే సమాజంలో మనం ఎంతో గౌరవంగా జీవించగలుగుతున్నామని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు దేవుళ్లతో సమానమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాల వల్ల పిల్లల్లో దేశ సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేవని, క్రమశిక్షణతో మెలుగుతూ పెద్దలతో గౌరవంగా మెలిగేవారని పేర్కొన్నారు.
నేటి వ్యవస్థలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై ప్రేమ, ఆప్యాయతలు తగ్గాయన్నారు. మన తల్లిదండ్రులు, పెద్దలు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, కష్టనష్టాలకోర్చి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారని.. వారి త్యాగాలకు మనం సదా రుణపడి ఉండాలన్నారు. నేటి తరం పిల్లలకు పాఠశాలలు, కళాశాలల్లో కుటుంబ విలువలు, కుటుంబంపై అవగాహన కలిగించాలని సూచించారు. వృద్ధులు 90 ఏండ్ల పైబడి బతుకుతున్నారంటే వారిలో ఉన్న మానసిక ధైర్యం, దృఢత్వం గుర్తించాలని, వారిపై ప్రేమ, అభిమానం, మమకారం చూపుతూ.. వారి అనుభవాలు తెలుసుకొని ముందు తరాలకు అందించాలని అభిలషించారు. కార్యక్రమంలో పీడీ డీఆర్డీఏ ప్రభాకర్, సంబంధిత అధికారులు, వృద్ధులు పాల్గొన్నారు.