మొయినాబాద్, అక్టోబర్ 1 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నెలవని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో బతుకమ్మలను మండలానికి తీసుకొచ్చారు. సంబురాల్లో వారు పాల్గొని గౌరమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. పూలను పూజించే సంస్కృతి తెలంగాణలో ఉందని చెప్పారు. బతుకమ్మ పోటీలు నిర్వహించగా.. ప్రథమ బహుమతి చిలుకూరు, ద్వితీయ బహుమతి అజీజ్నగర్, తృతీయ బహుమతి నాగిరెడ్డిగూడ గ్రామపంచాయతీలకు దక్కాయి. కార్యక్రమంలో ఎంపీడీవో సంధ్య, సూపరింటెండెంట్ సులోచన, వైస్ ఎంపీపీ మమత, సర్పంచ్లు మంజుల, రవళి, స్వరూప, సుకన్య, సురేందర్గౌడ్, నవనీత, సంధ్య, చందన, ఎంపీటీసీలు లత, సుజాత, అర్జున్, అంజయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, టీఆర్ఎస్ నాయకులు జయవంత్, ఆండ్రు, రాజు, నాగరాజు, ఈశ్వర్, పరమేశ్, రాజు పాల్గొన్నారు.
పూలను పూజించే సంప్రదాయం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నదని డీఆర్డీఏ ఏడీ ప్రభాకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డీఆర్డీఏ ఏడీ ప్రభాకర్ ముందుగా బతుకమ్మకు పూజలు చేసి మాట్లాడారు. ప్రకృతిలో లభించే పూలతో దేవతను చేసి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగ నిర్వహిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని.. మహిళలను గౌరవించి, వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగ అని పేర్కొన్నారు. సంబురాల్లో ఏవో ప్రమీల, డీఆర్డీఏ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.