దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమున్నదని ఉమ్మడి జిల్లా అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. సమైక్యరాష్ట్రంలో సాగునీరు లేక, పెట్టుబడి లేక రైతులు అష్టకష్టాలు పడేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతుల దశనే మార్చేశాయన్నారు. ప్రభుత్వం పుష్కలంగా సాగునీరు, సకాలంలో పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తుండడంతో అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పులిచ్చే స్థాయికి తెలంగాణ రైతులు ఎదిగారన్నారు. రాష్ర్టాన్ని ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనన్నారు. తెలంగాణలాగే దేశాన్ని కూడా అన్నపూర్ణగా మార్చగల సత్తా కేవలం కేసీఆర్కే ఉన్నదన్నారు. రైతు కష్టాలు తెలిసిన ఆయన దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీకి బుద్ధి చెప్పగల సమర్థుడు కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలోనే దేశం పురోగతి సాధిస్తుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ : తెలంగాణ ఏర్పాటు తర్వాత వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు అనేక పథకాలు అమలు చేస్తున్నది. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులకు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందజేస్తూ రైతును అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకొస్తున్నది. రైతుబంధు పథకం ప్రారంభించిన మొదట్లో ఎకరాకు రూ.4వేలు చొప్పున రెండు పంటలకు రూ.8వేలు సాయం అందజేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఎకరాకు రూ.5వేలకు పెంచడం జరిగింది. ఇవేకాకుండా రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రైతువేదికల నిర్మాణాన్ని సర్కారు చేపట్టింది. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే తలమానికంగా నిలిచాయి. రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరకొరగా సాయం చేసే పథకాన్ని అమలు చేస్తున్నది. దేశవ్యాప్తంగా రైతులందరూ సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్న ప్రస్తుత తరుణంలో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి దేశవ్యాప్తంగా తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ రైతులకు మేలు చేస్తుండు. రైతు బంధు, రైతు బీమా సాయం చేసిండు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణ మాదిరిగా పథకాలు అమలైతే దేశంలోని రైతులకు కొండంత భరోసా వస్తది.
– తమ్మగొండ శ్రీనివాస్, రైతు షాద్నగర్
గతంలో ఎవుసం చేయాలంటే చాలా బాధలు పడాల్సి వచ్చేది. బాకీలు తెచ్చి వడ్డీలు కట్టక ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతే వ్యవసాయాన్ని పండుగ చేసిండు. రైతులు సంతోషంగా ఉన్నారు. ఏటా ఎకరాకు రూ.10వేలు లాగోడి అందించి ఆదుకొంటుండు. తెలంగాణలో రైతుల పంట పండుతున్నది.
– తుంకిమెట్ల రాజు, రైతు, హస్నాబాద్, కొడంగల్
పండించిన పంటను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తున్నది. పంటను ఎవరికి అమ్మాలన్న బాధ తప్పింది. గతంలో వ్యాపారులు అగ్గువకు పంట ఇస్తే చేసిన అప్పులకే సరిపోయేది. రైతు వేదికల్లో సమావేశం పెట్టి వ్యవసాయ సాగు విధానాలను అధికారులు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని రైతన్నలు బాగుపడతారు.
– ఎరుకలి పెద్ద ఆవన్న, రైతు, హస్నాబాద్, కొడంగల్
కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయక జాప్యం చేసి రైతులను బాధపెడ్తున్నది. రైతులకు అవసరమైన ప్రతి దానిపై ధరలు పెంచిండ్రు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని రైతులకు మేలు జరుగుతది.
– బల్వంత్రెడ్డి, బస్వపూర్ గ్రామం, బంట్వారం మండలం
కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి ప్రధానమంత్రి కావాలి. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో తెలంగాణ సస్యశ్యామలమైంది. ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతలకు కొండంత అండగా నిలిచాయి. దేశ రాజకీయాల్లోకి వస్తే దేశ రైతులకు ఎంతో మేలు జరుగుతది.
– పీసరి రాజేశ్వర్రెడ్డి, రైతు, ఏట్ల ఎర్రవల్లి(షాబాద్)
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి సాగునీటితో పాటు పంటల పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా రెండు పంటలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన బిడ్డగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ప్రజలు సుభిక్షంగా ఉండాలని వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న గొప్ప నాయకుడి సేవలు భారతదేశానికి ఎంతో అవసరం.
– డేరంగుల సత్యనారాయణ,రైతు (ఇబ్రహీంపట్నం)
రైతులు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.రైతుల కష్టం తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్. కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణిస్తే దేశం మరింత పురోగతి సాధిస్తుంది. రైతుబంధు, రైతు బీమా, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు వంటి సంక్షేమ ఫథకాలు దేశం మొత్తం అమలు కావలంటే అది కేసీఆర్కే సాధ్యం.
– నాగారాజు, రొంపల్లి, బంట్వారం మండలం
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. రైతుల కష్టాలు తెలుసు కాబట్టే రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారు. సాగు సమయాలనికి పెట్టుబడి సాయం అందుతున్నది. దేశ వ్యాప్తంగా రైతులకు తెలంగాణ మాదిరిగా పథకాలు అందాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి.
– బీరప్ప, బషీరాబాద్ మండలం అల్లాపూర్
వ్యవసాయానికి ఉచితంగా నిరంతర కరెంట్ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. తెలంగాణలో అందుతున్న సేవలన్నీ దేశంలోని రైతులకు అందాలంటే సీఎం కేసీఆర్ జాతీ రాజకీయాల్లోకి వెళ్లాలి. రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నది. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లాల్సిందే.
– హరిమోహన్రెడ్డి, రైతు, తలకొండపల్లి మండలం
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని రైతులకు అండగా ఉంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ది. తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– టి.రాంచందర్, యాలాల మండలం
దేశంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో పూర్తి అవగాహన కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్. దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనకపోతే రాష్ట్ర సర్కారే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నది.
– శేఖర్రెడ్డి, రైతు, గొల్లూరుగూడ(షాబాద్)
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ మాదిరిగా పథకాలు అమలై దేశంలోని రైతులు బాగుపడ్తరు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచారు. సీఎం కేసీఆర్ సేవలు దేశ వ్యాప్తం అయితే యావత్ దేశం అభివృద్ధి చెందుతుంది. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్.
– చిలుకల వెంకటయ్య, కౌకుంట్ల గ్రామం, చేవెళ్ల మండలం
రాష్ట్ర ప్రజలు ఇష్టపడే నాయకుడు ముఖ్యమంతి కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తమైతే దేశంలోని రైతులందరికీ మేలు జరుగుతది. రైతు బంధు, రైతుబీమా, నిరంతరం ఉచిత విద్యుత్, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు తదితర ప్రయోజనాలు చేకూరుతాయి.
– పసుల మల్లయ్యగౌడ్, ఇప్పాయిపల్లి, కులకచర్ల మండలం