షాబాద్, సెప్టెంబర్ 27 : సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ నెలను పోషణ్ అభియాన్ మాసంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. పోషకాహార లోపం చిన్నారుల పాలిట రక్కసిగా మారుతున్నది. తల్లిపాలతో పాటు సంపూర్ణ పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోకపోవడంతో చిన్నారులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీనిని నివారించేందుకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం పోషణ్ అభియాన్ పేరిట నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు సూచనలు చేయడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కోడిగుడ్లు, పాలు అందిస్తున్నది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన పోషణ్ మాసోత్సవం ఈ నెలాఖరు వరకు ప్రత్యేక కార్యాచరణతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముందుకు సాగుతున్నది. రంగారెడ్డిజిల్లాలో 27 మండలాల పరిధిలో మొత్తం 1600 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 20,587 మంది గర్భిణులు, బాలింతలు ఉండగా, 1,31,652 మంది చిన్నారులున్నారు. వీరందరికీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంబంధిత అధికారులు పౌష్టికాహారం అందిస్తున్నారు.
ఆరోగ్యస్థాయిని మెరుగుపర్చేలా..
పౌష్టికాహార లోపంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని వారిలో ఆరోగ్యస్థాయి మెరుగుపర్చి, శిశు మరణాల రేటు తగ్గించడం పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం అందించడం కోసం సర్కార్ అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు చేవెళ్ల, ఆమనగల్లు, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్నగర్ ప్రాజెక్టుల పరిధిలో 1600 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 220 మినీ కేంద్రాలున్నాయి. మొత్తం గర్భిణులు, బాలింతలు 20,587 ఉండగా, చిన్నారులు 1,31,652(7 నెలల నుంచి 3 ఏండ్ల లోపు చిన్నారులు 69,870 మంది, 3ఏండ్ల నుంచి ఆరేండ్ల పిల్లలు 27,718)మంది ఉన్నారు. ఇందులో 12వేల మంది చిన్నారులు తక్కువ బరువుతో ఉండగా, 865 మంది అతి తక్కువ బరువులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి రోజూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నది.
వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు ఉండేలా చర్యలు..
చిన్నారుల వయస్సుకు తగినట్లు బరువు, ఎత్తు ఉండాలన్న లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రతి రోజూ పిల్లలకు పోషకాహారం అందిస్తున్నది. పోషక మాసోత్సవంలో భాగంగా ముందుగా చిన్నారుల వయస్సుకు తగిన ఎత్తు, బరువులను గుర్తిస్తారు. అలాగే ఆ పిల్లల ఇంటికి ప్రత్యేకంగా అదనపు ఆహారం అందిస్తారు. నెల తర్వాత పిల్లల ఎత్తు, బరువు ఎంత ఉందో సేకరిస్తారు. ఈ వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు రికార్డుల్లో పొందపరుస్తారు. దీన్ని బట్టి ఆరేండ్ల లోపు చిన్నారులకు ఏయే మోతాదులో పోషకాహారం అందించాలో వివరిస్తారు. పోషకాహారం ద్వారా కలిగే ప్రయోజనాన్ని వివరించేలా అవగాహన కల్పిస్తారు. పిల్లల్లో చురుకుదనం, లోప పోషణ తగ్గించడం, రక్తహీనత తగ్గించడంతో పాటు తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించడం ఈ మాసోత్సవ లక్ష్యం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా మాతాశిశు రక్షణ, పౌష్టికాహారం అందించే చర్యలు చేపడుతున్నారు. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.
నాలుగు వారాలు ప్రత్యేక కార్యక్రమాలు..
పోషణ్ అభియాన్ మాసోత్సవంలో భాగంగా మొదటి వారం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తులు, బరువులు నమోదు చేస్తారు. రెండో వారంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ర్యాలీలు చేపడుతారు. మూడో వారంలో న్యూట్రీ గార్డెన్, కిచెన్ గార్డెన్లో భాగంగా సమతుల ఆహారం తీసుకోవడం, కూరగాయల మొక్కలు పెంచడంపై అవగాహన కల్పిస్తారు. నాలుగో వారంలో పోషణ్ మేళా నిర్వహించి పౌష్టికాహారం కలిగిన పదార్థాలపై వివరిస్తారు. సీసా పాలు పట్టడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తారు. స్కూళ్లు, అంగన్వాడీల్లో కూరగాయల పెంపకం వల్ల కలిగే లాభాలను వివరిస్తారు. నెల రోజుల పాటు జరిగే ఈ పోషణమాసోత్సవం కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. శిశువు పుట్టిన గంటలోగా ముర్రుపాలు తాగించాలి. పిల్లలకు ఆరు నెలలు నిండేదాకా కేవలం తల్లిపాలే పట్టే విధంగా సంబంధిత ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు ఆయా గ్రామాల్లోని గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు.
పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నాం
పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేలా పోషణ్ అభియాన్ మాసోత్సవం నిర్వహిస్తున్నాం. నెలపాటు ప్రతి వారం ఒక్కో అంశంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. పుట్టిన బిడ్డలు వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు ఉంటూ ఆరోగ్యంగా ఎదిగేలా తల్లులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 1,31,652 మంది చిన్నారులుండగా, అందులో 12వేల మంది చిన్నారులు తక్కువ బరువుతో ఉండగా, 865 మంది చిన్నారులు అతి తక్కువ బరువుతో ఉన్నారు.
– మోతి, రంగారెడ్డి జిల్లా సంక్షేమశాఖ అధికారి