పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు పాలకుల చిత్తశుద్ధి, అధికారుల నిబద్ధతతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికయ్యాయి. శివారు మున్సిపాలిటీలైన తుర్కయాంజాల్, ఆదిబట్ల ప్రగతిలో పరుగులు తీస్తూ.. పారిశుధ్య నిర్వహణలో సత్తాచాటుతున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జూలై 2021నుంచి జనవరి 2022 మధ్య పారిశుధ్యంపై సర్వే నిర్వహించగా, ఆదిబట్ల, తుర్కయాంజాల్ అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ అవార్డులను అక్టోబర్ 1న రాష్ట్రపతి అందజేయనున్నారు. అనేక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సర్వే నిర్వహించడంతో పాటు స్థానికులకు ఉన్న అవగాహన తదితర అంశాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ పరిగణనలోకి తీసుకున్నది. జాతీయ స్థాయిలో శివారు మున్సిపాలిటీలకు గుర్తింపు వచ్చేలా కృషి చేసిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 25 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిని అందిపుచ్చుకుని అనతికాలంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి రెండు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ప్రభుత్వం అందజేస్తున్న సూచనలు, సలహాలతో పాటు నిధులు కూడా భారీగానే కేటాయించడంతో ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలు అభివృద్ధిలో పోటీపడి ఈ అవార్డులను సొంతం చేసుకున్నాయి. అక్టోబర్ 1న రాష్ట్రపతి అవార్డులను అందజేయనున్నారు. నగరశివారుల్లో ఉన్న తుర్కయాంజాల్, ఆదిబట్ల గతంలో అభివృద్ధికి అంతగా నోచుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేండ్ల క్రితం ఆదిబట్ల, తుర్కయాంజాల్ను ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీలుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిపక్షాలు మున్సిపాలిటీల ఏర్పాటును వ్యతిరేకించినప్పటికీ మున్సిపాలిటీలు ఏర్పడిన తర్వాత సాధిస్తున్న ప్రగతిని వారు కూడా అభినందించక తప్పడంలేదు.
చెత్తసేకరణకు అధిక ప్రాధాన్యమివ్వడంతో తుర్కయాంజాల్, ఆదిబట్ల చెత్తరహిత మున్సిపాలిటీలుగా విజయం సాధించాయి. ఈ మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణ కోసం ప్రత్యేకించి ఆటోలను కొనుగోలు చేశారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో 12 ఆటోలు, 2 ట్రాక్టర్లు, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 20 ఆటోలతోపాటు 4 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజూ ఉదయం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్యార్డుల్లో పోసి వాటి నుంచి తడి, పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు ఎరువులను కూడా తయారు చేస్తున్నారు. మరోవైపు చెత్తను రోడ్లపై వేయడంవల్ల కలిగే అనర్థాలపై ఇంటింటికీ ప్రచారాన్ని నిర్వహించారు. ఇండ్ల నుంచి వచ్చే చెత్తను సేకరించడం కోసం ప్లాస్టిక్ డబ్బాలను కూడా ఇంటింటికీ అందజేశారు. చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ మున్సిపాలిటీల పరిధిలో రోడ్లు అద్దాలను తలపించేలా ఉన్నాయి.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సాగర్ రహదారిపై గల మాసాబ్ చెరువు మినీ ట్యాంక్బండ్ను పార్కుగా తయారుచేశారు. చెరువు వద్దకు వచ్చే పర్యాటకులు పార్కులో కూర్చోవడానికి బెంచీలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం, పార్కులో వాకింగ్ చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు.
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు జాతీయస్థాయి సానిటేషన్ సర్వే నిర్వహించింది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన ఆదిబట్ల, తుర్కయాంజాల్లో కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను నిర్వహించారు. ఈ అవార్డులకు ఎంపిక చేయడానికి 80 అంశాలను ప్రాతిపాదికన తీసుకున్నారు. అందులో తడిపొడి చెత్త సేకరణ, చెత్తలేని వాణిజ్య ప్రాంతాలు, చెత్త నుంచి ఎరువుల తయారీ, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుధ్యంపై స్థానికులకు ఉన్న అవగాహన, సృజనాత్మకత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వాటి ఆధారంగానే ఈ అవార్డులను ఎంపికచేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈ మున్సిపాలిటీల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, అలాగే, పట్టణ ప్రగతి కింద నాలుగు విడుతలుగా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో మారిన రూపురేఖలు వంటివాటిని పరిగణనలోకి తీసుకున్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతితో తుర్కయాంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీల రూపురేఖలు మారాయి. వార్డుల వారీగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు పనులను ఎంపికచేశారు. అందులో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, భూగర్భ డ్రైనేజీల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు, పురాతన ఇండ్లు, మరుగునీటికాల్వల తొలగింపు చేపట్టారు. హరితహారంలో భాగంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 1,62,600, ఆదిబట్ల మున్సిపాలిటీలో 1.60లక్షలకు పైగా మొక్కలు నాటారు. వీటి సంరక్షణకు ప్రత్యేక వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేసి నీటిని అందించారు. వైకుంఠధామాల నిర్మాణం చేపట్టారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో రెండు వైకుంఠధామాల నిర్మాణంతో పాటు రెండు క్రీడా ప్రాంగణాల నిర్మాణం కూడా చేపట్టారు. ఈ రెండు మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఇంజాపూర్ నుంచి ఖానాపూర్ వరకు సాగర్ రహదారి డివైడర్పై మొక్కలు నాటారు. ప్రస్తుతం సాగర్ రహదారి పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఈ రెండు మున్సిపాలిటీల్లో పారిశుధ్యంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన నిషేధించారు. అందుకోసం ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు మున్సిపాలిటీల పరిధిలోని ఆయా గ్రామాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం కూడా చేపట్టారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో 5, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 8 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. వీటి నిర్మాణంతో బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన పూర్తిగా అదుపులోకి వచ్చింది.
నియోజకవర్గంలోని ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడినప్పటికీ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో తక్కువ కాలంలోనే స్వచ్ఛ అవార్డుకు ఎంపికయ్యాయి. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు పలు రకాల ప్రోత్సాహాన్ని అందించింది. దీంతో పాత మున్సిపాలిటీలతో పోటీపడి ఈ రెండు మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకుపోయాయి.
ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు మున్సిపాలిటీల అధికారులు, ప్రజాప్రతినిధులు మరిన్ని అద్భుతాలు సృష్టించాలి. పారిశుధ్యంపై ఇంటింటికీ ప్రచారం : అమరేందర్రెడ్డి, ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే, ఎలాంటి వ్యాధులు రావన్న ఉద్దేశంతో మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి వెళ్లి పారిశుధ్యంపై ప్రచారం నిర్వహించాం. రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపాలిటీలు అందజేసిన చెత్త బుట్టల్లోనే చెత్త వేసి.. ప్రతి రోజూ ఇంటిముందుకు వచ్చే ట్రాక్టర్లోనే చెత్త వేయాలని సూచించాం. దీనికి ప్రజలంతా సహకరిస్తున్నారు. పారిశుధ్యంలో మంచి ఫలితాలను సాధించాం.