కడ్తాల్, సెప్టెంబర్ 25 : మండలంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం నుంచి దసరా శరన్నవత్రులు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 5వ తేదీ వరకు ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు లలితా సహస్రనామ బృందం, ఆలయ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవిగా, 27న గాయత్రీదేవిగా, 28న శ్రీమహాలక్ష్మీదేవిగా, 29న అన్నపూర్ణదేవిగా, 30న లలితా పరమేశ్వరీదేవిగా, అక్టోబర్ 1న భ్రమరాంబికదేవిగా, 2న సరస్వతీదేవిగా, 3న దుర్గాదేవిగా, 4న మహిషాసురమర్దినిగా, 5న రాజరాజేశ్వరీ దేవి అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
షాద్నగర్టౌన్ : దేవీ శరన్నవరాత్రులకు షాద్నగర్ పట్టణంలోని అమ్మవారి దేవాలయాలు ఆదివారం ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఆలయాల్లో ప్రతి రోజూ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కుంకుమార్చన చేయనున్నారు. దేవాలయాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరం, కన్యకాపరమేశ్వరి, వేంకటేశ్వరస్వామి దేవాలయంలో అమ్మవారు రోజుకొక్క అవతారంలో దర్శనమివ్వనున్నారు.
చేవెళ్లటౌన్ : మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని దేవస్థానం మేనేజర్ శ్రీనివాస్, ఫౌండర్ట్రస్ట్ మాణిక్య ప్రభు తెలిపారు. పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. అదే విధంగా ప్రతి రోజూ గ్రామ భక్తులతో దేవాలయంలో 7 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, సహస్ర దీపాలంకణ ఉంటుందని తెలిపారు. అలాగే చేవెళ్ల మండల కేంద్రంలోని రచ్చ బండ వద్ద దుర్గామాత మండపం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీ సేవాసమితి ఆధ్వర్యంలో ఉత్సవాలను జరుపనున్నారు. 5వ తేదీన దుర్గామాత నిమజ్జనాన్ని చేవెళ్ల పుష్కరిణిలో చేయనున్నట్లు తెలిపారు.